మమతకు పవర్ ఫుల్ లేడీ ఆఫీసర్ తో చెక్
ఆమె ప్రభుత్వంలో పదిహేనేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణకు రెండు కమిషన్లు సువేందు అధికారి ప్రభుత్వం ప్రకటించింది.
By: Satya P | 21 May 2026 8:45 AM ISTపశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాజకీయంగా శత్రువు శేషం లేకుండా చూసుకుంటున్నారు. ఆయన రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన రాజకీయ గురువు మమతా బెనర్జీ సంగతి బాగా ఎరిగిన వారు కావడంతో ఆమె నుంచి భవిష్యత్తులో ఏ రూపేణా ముప్పు రాకుండా చూసుకుంటున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత సరిగ్గా పది రోజులు కూడా గడవకుండానే మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మీద విచారణకు సిద్ధపడ్డారు. ఆమె ప్రభుత్వంలో పదిహేనేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణకు రెండు కమిషన్లు సువేందు అధికారి ప్రభుత్వం ప్రకటించింది.
రెండు కమిషన్లు ఏర్పాటు :
మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని గత టీఎంసీ పాలనలో బెంగాల్ రాష్ట్రంలో జరిగిన సంస్థాగత అవినీతి మీద వచ్చిన ఆరోపణలు అలాగే మహిళలపై జరిగిన నేరాలపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో రెండు కమిషన్లను సువేందు అధికారి ప్రభుత్వం ప్రకటించింది.సంస్థాగత అవినీతికి సంబంధించిన ఇందులో ఒక కమిషన్ కి కలకత్తా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వజిత్ బసు నేతృత్వం వహించనుండగా ఏడీజీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారి జయరామన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్ అంఫాన్ తుఫాను పునరావాసం, పీఎంఏవై, 100 రోజుల పని, మధ్యాహ్న భోజన పథకం వంటి అన్ని ప్రాజెక్టులలోని అవినీతి దోపిడీ వంటి కేసులన్నింటినీ విచారిస్తుంది.
మహిళల మీద నేరాలు :
ఇక బెంగాల్ లో గత దశాబ్దన్నర కాలంలో మహిళలు, బాలికలపై నేరాల కేసుల విచారణకు సంబంధించి విచారణకు నియమించిన రెండవ ఈ కమిషన్కు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సమాప్తి ఛటర్జీ అధ్యక్షత వహించనుండగా ఐపీఎస్ అధికారి దమయంతి సేన్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ రెండు కమిషన్లు జూన్ 1 నుంచి తమ పనిని ప్రారంభిస్తాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. ముప్పయి రోజుల వ్యవధిలో ఈ కమిటీలు నివేదిక ఇస్తాయని తెలుస్తోంది.
దమయంతి సేన్ ఎవరు :
ఇదిలా ఉంటే మహిళల అత్యాచారాలకు సంబంధించి విచారించే కమిటీలో సభ్య కార్యదర్శిగా దమయంతీ సేన్ ని బీజేపీ ప్రభుత్వం నియమించడం వ్యూహాత్మకమే అని అంటున్నారు. ఇంతకీ ఎవరామే అన్నదే చర్చకు వస్తోంది. ఆమెని గత సీఎం మమతా బెనర్జీ చేత పక్కన పెట్టారు. సువేందు అధికారి ప్రభుత్వంలో ఆమె ఇపుడు కీలక పాత్రను పొందారని అంటున్నారు. 2012 పార్క్ స్ట్రీట్ అత్యాచార కేసును దర్యాప్తు చేసి అసలైన నిందితులను బయటకు తీసి జాతీయ స్థాయిలోనే నాడు పేరు మారు మోగిన పవర్ ఫుల్ లేడీ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్. ఆ కేసులో నిష్పక్షపాత దర్యాప్తును ఆమె చేశారు. అయితే అందుకు గానూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ మమత ప్రభుత్వం ఆమెను సీనియర్ అధికారి హోదా నుంచి పక్కన పెట్టి లూప్ లైన్ లోకి పంపించింది.
మమతకు చెక్ పెట్టేలా :
ఒకనాడు మమతా బెనర్జీ ప్రభుత్వంలో ప్రాధాన్యతను కోల్పోయిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్కు కీలక స్థానం ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి సువేందు అధికారి మమతకు చెక్ పెట్టాలని వ్యూహరచన చేశారు అని అంటున్నారు. నిజాయతీపరురాలు అయిన అధికారిణిగా పేరు ఉన్న ఆమె మహిళా అత్యాచారాలు నేరాలు ఘోరాల మీద పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇస్తే ఇక పని పట్టడమే సువేందు అధికారి వంతు అని అంటున్నారు. దాంతో ఇపుడు మమతా వర్సెస్ దమయంతీగా బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
