సీఎం బంగళాను వదిలేసిన మమత.. భవానీపూర్లో ఇల్లు అద్దెకు.. రీజన్?
గత 2021లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ అధికారంలోకి వచ్చినా.. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
By: Garuda Media | 1 May 2026 5:00 AM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి 24 గంటలు అయినా.. అక్కడ రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ వర్సెస్.. సీఎం మమతాబెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదేసమయంలో మోదీ వర్సెస్ దీదీ(అక్క) మధ్య భారీ పోరు కూడా ఉంటుందన్న అంచనాలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఓ సార్వత్రిక సమరాన్ని తలపించాయి. తమకు ఎడ్జ్ ఉంటుందని అంచనా వేసిన బీజేపీ చివరి వారం రోజులు రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
ఇలా.. ఇరు పక్షాలు కూడా.. నువ్వా-నేనా అన్నట్టుగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం మమతా బెనర్జీ.. ఈ దఫా తను పోటీ చేస్తున్న భవానీ పూర్ నియోజకవర్గంలో తిష్ఠ వేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ఆమె చెప్పిన మాట ప్రకారం.. తాను భవానీపూర్లోనే ఉండనున్నారు. అయితే.. ఆ వెంటనే ఆమె కోల్కతాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.
అధికారిక బంగ్లా వదిలేసి.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు.. అంటే మే 4వ తేదీ వరకు ఆమె భవానీ పూర్లోనే ఉంటారని అధికార వర్గాలు కూడా చూచాయగా తెలిపాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ లోగానే.. అధికార పార్టీ తృణమూల్ నాయకులు.. భవానీపూర్లో మూడు పడకగదుల ఫ్లాట్ కోసం వెతుకుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి సీఎం తన అధికారిక బంగ్లాను వదిలేసి.. భవానీపూర్లోనే మూడు రోజుల పాటు.. ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారా? అనేది చూడాలి.
ఎందుకు?
గత 2021లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ అధికారంలోకి వచ్చినా.. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీనికి ఓట్ల లెక్కింపులో జరిగిన తేడానే కారణమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోటీ చేస్తున్న భవానీపూర్లోనూ లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ఆమె.. వచ్చే మూడు రోజులు .. ఈవీఎంలను నిక్షిప్తం చేసిన.. స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వెళ్లి.. తరచుగా పరిశీలిస్తానని కాపలా ఉంటానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి కేవలం 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న భవానీపూర్లోనే మూడు రోజులు విడిది చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
బీజేపీ సెటైర్లు..
సీఎం మమత నిర్ణయంపై బీజేపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఎలానూ నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి బంగళాను ఆమె ఖాళీ చేయాల్సిందేనని.. బీజేపీ అధికారంలోకి వస్తోందని.. దీనిని ఊహించే.. ఆమె ముందుగానే బయటకు వస్తున్నారని చెప్పారు. మమత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ నాయకులు ఎద్దేవా చేయడం గమనార్హం.
