ఆనాటి అవమానానికి ఈనాడు ప్రతీకారం !
ఎంత రాజకీయం అయినా ఎంత శాశ్వత శతృత్వం లేదని అన్నా రాగద్వేషాలు ఉండకుండా ఉంటాయా.
By: Tupaki Desk | 19 April 2025 3:30 PMఎంత రాజకీయం అయినా ఎంత శాశ్వత శతృత్వం లేదని అన్నా రాగద్వేషాలు ఉండకుండా ఉంటాయా. ఒకనాడు తగ్గినట్లు కనిపించినా ఏదో నాటికి అవి అనుకూలమైన పరిస్థితుల నేపధ్యంలో బయటకు వస్తాయి. అలా విశాఖలో వైసీపీ మేయర్ ని గద్దే దించడానికి ఆయనలో ప్రతీకారం ఇలా పనికి వచ్చింది అని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అంటే విశాఖ జనసేన ప్రెసిడెంట్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్.
ఆయన వైసీపీలో ఉన్నపుడు 2019లో విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కలేదు. ఆనాడు ఆయనకు ఇచ్చిన హామీ విశాఖ మేయర్ పదవి ఇస్తామని. అలా అనుకునే ఆయన చేత కార్పొరేటర్ గా పోటీ చేయించారు. ఎమ్మెల్యేగా అప్పటికి రెండు సార్లు పోటీ చేసి విశాఖ సిటీకి వైసీపీకి ప్రెసిడెంట్ గా పనిచేసిన ఆయన పార్టీ అధినాయకత్వం ఇచ్చిన హామీని నమ్మి తన స్థాయిని తగ్గించుకుని మరీ కార్పోరేటర్ గా పోటీ చేసి గెలిచి వచ్చారు.
తీరా విశాఖ కార్పోరేషన్ వైసీపీ పరం అయ్యాక అధినాయకత్వం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అంతవరకూ కనీసం ఎక్కడా ప్రచారంలో లేని హరి వెంకటకుమారిని తీసుకుని వచ్చి మేయర్ ని చేసింది. అలా వంశీకి హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆయన రగిలిపోయారు. అయితే అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్ళు కూడా కాలేదు. దాంతో ఆయన తన మనసులో బాధను దాచుకున్నారు.
అయితే ఆయనకు ఎమ్మెల్సీగా అదే ఏడాది చివరిలో వైసీపీ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. కానీ విశాఖ మేయర్ వంటి కీలక పదవి ఇస్తామని చెప్పి అన్యాయం చేశారు అన్న బాధ అయితే వంశీలో ఉంది. అలా ఆయన అసంతృప్తితోనే 2024 ఎన్నికల ముందు వరకూ ఉన్నారు. చివరికి ఆయన పార్టీ మారి జనసేనలో చేరారు.
టీడీపీ కూటమి ప్రభంజనంలో ఆయన బంపర్ మెజారిటీతో అక్కడ నుంచి గెలిచారు. ఇక ఆనాటి నుంచే ఆయన విశాఖ మేయర్ పీఠానికి గురి పెట్టారు. ఎలాగైనా వైసీపీని అక్కడ నుంచి దించేస్తామని ప్రతిన పూనారని చెబుతారు. ఇక కేవలం పది నెలల కాలం మాత్రమే ఈ పదవి ఉంది. దాంతో ఒక దశలో టీడీపీ కూడా ఎందుకొచ్చిన అవిశ్వాసం అనవసరంగా హంగామా అని ఆలోచించినా ఆయన పట్టుదలతో టీడీపీ కూడా గట్టిగా నిలబడాల్సి వచ్చిందని చెబుతారు.
ఇక వైసీపీ నుంచి జనసేనలోకి ఏకంగా 11 మంది కార్పోరేటర్లను ఆకర్షించడంలో వంశీ ప్రభావం ఉందని చెబుతారు. ఆఖరు నిముషం వరకూ ఆయన అన్నీ తాను అయి వ్యవహరించారు. ఎలాగైనా వైసీపీకి షాక్ ఇవ్వాలన్న ఆయన పట్టుదల చివరికి గెలిచి వైసీపీ మేయర్ మాజీ అయిపోయారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి మీడియాతో మాట్లాడుతూ గతంలో తనకు ఏదో జరిగినది అని వంశీ క్రిష్ణ ఇపుడు తనను దింపేయాలని చూస్తున్నారు అని విమర్శించారు.
ఇక్కడ తమాషా ఏమిటి అంటే ఇద్దరూ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే ఇపుడు మేయర్ పదవి గవర సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళబోతోంది. దాంతో యాదవ సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐక్యత లేకపోవడం వల్లనే తాము ఈ పదవిని కోల్పోయామని ఆ సామాజిక వర్గం నేతలు అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ వైసీపీ మేయర్ ని దించేయడంలో వంశీ కీలకమైన పాత్ర పోషించారు అని అంతా అంటున్నారు.