భారత మాజీ క్రికెటర్ సోదరుడు అరెస్ట్
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుటుంబం చిక్కుల్లో పడింది.
By: Tupaki Desk | 7 March 2025 4:51 PM ISTటీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుటుంబం చిక్కుల్లో పడింది. సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ ను చంఢీగడ్ లోని మణిమజ్రా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై రూ.7 కోట్లు విలువైన చెక్ బౌన్స్ కేసు నమోదు చేయబడింది.
ఈ కేసులో వినోద్ సెహ్వాగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. వినోద్ న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇంకా ఆమోదం లభించలేదు. ఈ బెయిల్ పిటిషన్ పై మార్చి 10న తీర్పు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వినోద్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్ కు మొత్తం నలుగురు అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారు. వీరిలో వినోద్ సెహ్వాగ్ అత్యంత చిన్నవాడు. క్రికెట్లో సెహ్వాగ్ భారత జట్టు తరఫున 251 వన్డేలు ఆడి 8,273 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 15 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 96 వికెట్లు కూడా తీసుకున్నాడు. అలాగే, 104 టెస్టులలో 8,586 పరుగులు చేసి, ఆరు డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో 40 వికెట్లు కూడా పడగొట్టాడు.
