Begin typing your search above and press return to search.

విజయ సాయిరెడ్డి స్పెషల్ మేనిఫెస్టో... ఎన్ని హామీలంటే...?

అవును... అధికార వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేయగా... తాను ఎంపీగా పోటీ చేస్తున్న నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతానికి ప్రత్యేకంగా లోకల్ మేనిఫెస్టోను రూపొందించారు సాయిరెడ్డి.

By:  Tupaki Desk   |   1 May 2024 5:39 AM GMT
విజయ సాయిరెడ్డి స్పెషల్  మేనిఫెస్టో... ఎన్ని హామీలంటే...?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అధికార వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించగా... టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోనూ విడుదల చేశాయి. ఇదే సమయంలో... ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌ సభ నుంచి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తోన్న సీనియర్ నేత విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా స్థానిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో కీలక హామీలను పొందుపరిచారు.

అవును... అధికార వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేయగా... తాను ఎంపీగా పోటీ చేస్తున్న నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతానికి ప్రత్యేకంగా లోకల్ మేనిఫెస్టోను రూపొందించారు సాయిరెడ్డి. ఇందులో భాగంగా... నెల్లూరు లోక్‌ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి 46 హామీలను పొందుపరిచారు.

ఈ సందర్భంగా స్పందించిన సాయిరెడ్డి... నెల్లూరు లోక్‌ సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ద్వారా మాత్రమే తమ కలలు సాకారం అవుతాయనే విషయం నెల్లూరు జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన హామీలకు టీడీపీ మద్దతు ఉంటుందా లేదా అంటూ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు.

ఇందులో భాగంగా... కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పిన సాయిరెడ్డి.. వారు అధికారంలోకి రాగానే యూనిఫాం సివిల్‌ కోడ్‌ ను తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఈ సివిల్‌ కోడ్‌ ను ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సమర్ధిస్తుందా.. లేదా.. అని ప్రశ్నించారు. ఆ విషయంపై ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదని వెల్లడించారు.

ఇదే క్రమంలో.. ఆ యూనిఫాం సివిల్‌ కోడ్‌ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ముసాయిదాను సైతం బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసిందని చెప్పిన సాయిరెడ్డి... దీనిపై అధ్యయనానికి ఒక కమిటీని వేశారని, లా కమిషన్‌ కు రిఫర్‌ చేశారని వివరించారు. అయితే.. దీన్ని ముస్లింలు బలంగా వ్యతిరేకిస్తున్నారని.. ఇదే సమయంలో క్రిస్టియన్లు, దళితులు, బీసీలు సైతం వ్యతిరేకిస్తున్నారని.. ఇలాంటి బిల్లును వైసీపీ ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో... ఈ యూనిఫాం సివిల్‌ కోడ్‌ పై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తో పాటు బీజేపీ స్థానిక నాయకత్వం సూటిగా సమాధానం చెప్పాల్సిందేనని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నిలదీశారు.