పాదాలపై మేకులు కొట్టారు: సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ(28) అదృశ్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అప్పటి సీఐ నాగరాజును అరెస్టు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు.
By: Garuda Media | 5 July 2026 1:28 PM ISTవిజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ(28) అదృశ్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అప్పటి సీఐ నాగరాజును అరెస్టు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇక, ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా అరెస్టు చేశారు. ఇక, తాజాగా ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ విచారణ జరిగింది.
అనేక ప్రజాసంఘాలు, పార్టీలకు చెందిన నాయకులు సహా.. సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఈ విచారణకు హాజరయ్యారు. వీరిలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని సబ్ కలెక్టర్ విడిగా విచారించారు. ఆమె నుంచి పలు ఆధారాలను, వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని మార్కాపురంలో అరెస్టు చేసిన తర్వాత.. కృష్ణ పోలీసులకు అప్పగించారని... తర్వాత.. తీవ్రంగా హింసించారని ఆమె తెలిపారు. పాదాలపై మేకులు కొట్టి రక్తం వచ్చాక.. దానిని చూసి పోలీసులు ముఖ్యంగా సీఐ ఆనందించాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
తన కుమారుడు ఏం తప్పుచేశాడని ఇంతగా శిక్షించారని ఆమె ప్రశ్నించారు. తన కుమారుడిని తనకు అప్పగించాలని.. లేకపో తే ఆత్మహత్య చేసుకుంటానని విజయలక్ష్మి హెచ్చరించారు. నాగరాజు లాంటి వ్యక్తులు సమాజానికి శాపమని ఆమె పేర్కొన్నా రు. ఇలాంటి వారిని క్షమించరాదని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణలంక పోలీసు స్టేషన్ టెర్రస్పై లభించిన ఎముకలు, రక్తం నమూనాలతో కూడిన లాఠీ వంటివాటిపై సబ్ కలెక్టర్ ప్రశ్నించినప్పుడు.. అది తన కుమారుడిదేనని గ్యారెంటీ ఏంటని ఆమె ప్రశ్నించారు. నాగరాజు వంటి వారు ఇంకెంతమందిని చంపారో తెలియాల్సి ఉందని చెప్పారు.
తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని విజయలక్ష్మి తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయకపోతే.. నిరాహార దీక్షకు దిగి.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తన కుమారుడిని అన్యాయంగా బలితీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ సమయంలో ఆమె రోదనలతో సబ్ కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. ఆమెను ఓదార్చేందుకు సబ్ కలెక్టర్ తన సీటులోంచి లేచి.. ఆమెను పట్టుకుని ఓదార్చేందుకు ప్రయత్నించారు. న్యాయం జరుగుతుందని.. ఈ కేసును ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే మెజిస్టీరియల్ విచారణను కూడాచేపట్టామని వివరించారు. కాగా.. మొత్తం 200 మందికిపైగా ఈ విచారణలో పాల్గొని తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు.
