Begin typing your search above and press return to search.

మద్యం స్కాంలో సాయిరెడ్డి ట్విస్టు.. అంత తొందర ఎందుకో?

పోలీసు కేసులు, విచారణ అంటే ఎవరైనా వెనకడుగు వేస్తారు.. తప్పించుకోడానికి సహజంగా ప్రయత్నిస్తారు.

By:  Tupaki Desk   |   16 April 2025 8:44 AM
మద్యం స్కాంలో సాయిరెడ్డి ట్విస్టు.. అంత తొందర ఎందుకో?
X

ఏపీ మద్యం స్కాంపై సిట్ విచారణ ఊపందుకుంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం వేటాడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు.. ఈ నెల 18న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ఆ రోజు వేరే పనులు ఉన్నాయని సమాధానమిచ్చిన విజయసాయిరెడ్డి.. సిట్ అధికారులే ఆశ్చర్యపోయేలా ఓ రోజు ముందుగానే విచారణకు వస్తే మీకేమైనా అభ్యంతరమా? అంటూ లేక రాయడం చర్చనీయాంశమవుతోంది.

పోలీసు కేసులు, విచారణ అంటే ఎవరైనా వెనకడుగు వేస్తారు.. తప్పించుకోడానికి సహజంగా ప్రయత్నిస్తారు. కానీ, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం తన రూటే సెపరేటు అంటున్నారు. 18న విచారణకు రమ్మంటూ సిట్ పోలీసులు నోటీసులిస్తే.. అంతవరకు నేను వెయిట్ చేయలేను ఒక రోజు ముందే వచ్చేస్తానంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. 18న తనకు ప్రైవేటు పనులు ఉన్నాయని, ముందస్తుగా నిర్ణయించుకోవడం వల్ల ఆ పనులను వాయిదా వేయలేనని విజయసాయిరెడ్డి పోలీసులకు చెప్పారని అంటున్నారు. సాధారణంగా ఇలా ఎవరైనా పోలీసు విచారణకు వెళ్లాల్సివస్తే, పోలీసులు సూచించిన తేదీ తర్వాత కనీసం వారమైనా గడువు తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ, విజయసాయిరెడ్డి తనకు అలాంటి గడువు కోరకుండా, పోలీసులు చెప్పిన సమయానికి ముందుగానే వచ్చేస్తాననడంతో ఆయన బాగా ప్రిపేర్ అయి రెడీగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే మద్యం స్కాంపై లోగుట్టును రద్దు చేశారు విజయసాయిరెడ్డి. మార్చి నెల 12న కాకినాడ సీపోర్టు, సెజ్ భూముల విషయంలో విచారణ ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మద్యం స్కాం సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రమేనంటూ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలోనే తనను మద్యం స్కాంపై ప్రశ్నించలేదని, ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు చెప్పేస్తానని వెల్లడించారు. ఇక ఆ సమయం రావడంతో విజయసాయిరెడ్డి సిట్ విచారణలో ఏం చెబుతారనేది నిందితులకు టెన్షన్ పుట్టిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ హైకమాండ్ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

లిక్కర్ స్కాంలో తన పాత్ర ఏమీ లేదని చెబుతున్న విజయసాయిరెడ్డి తనకు తెలిసిన గుట్టు మొత్తం విప్పేస్తానని చెప్పడంతో గురువారం ఏ సంచలనం నమోదు అవుతుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం లిక్కర్ స్కాంలో రూ.3 వేల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇంతవరకు ఫలానా వ్యక్తులు అనుమానితులు అంటూ కొందరికి నోటీసులిచ్చి విచారణ చేస్తోంది. కానీ, ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితుల జాబితాలో చేర్చలేదు. ఇక ఇదే స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కసిరెడ్డి పరారీలో ఉండగా, ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు రక్షణతో బయట హ్యాపీగా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇచ్చే సమాచారంతో ఎవరెవరికి పోలీసు కాల్స్ వస్తాయోనని టెన్షన్ ఎక్కువవుతోంది. ఏదైనా మరో 24 గంటల్లో వైసీపీలో కొందరి ముఖ్యుల జాతకాలు తారుమారు అవుతాయా? అనే అనుమానం ఆ పార్టీ కార్యకర్తలను పీడిస్తోందని అంటున్నారు.