Begin typing your search above and press return to search.

విజయ్ నా కాళ్లపై పడ్డారు.. కరూర్ బాధితురాలు చెప్పిన కఠిన నిజాలు

తమిళనాడు రాజకీయ చరిత్రలో అద్భుత విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, దళపతి విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది

By:  A.N.Kumar   |   15 May 2026 12:44 PM IST
విజయ్ నా కాళ్లపై పడ్డారు.. కరూర్ బాధితురాలు చెప్పిన కఠిన నిజాలు
X

తమిళనాడు రాజకీయ చరిత్రలో అద్భుత విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, దళపతి విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతేడాది కరూర్‌లో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట ఘటనలో బాధితులు.. విజయ్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఒక బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు విజయ్ లోని మానవత్వాన్ని, వినయాన్ని చాటిచెబుతున్నాయి.

ఆ రాత్రి కరూర్‌లో ఏం జరిగింది?

గతేడాది సెప్టెంబర్ 27వ తేదీ తమిళనాడు రాజకీయాల్లో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు అంచనాలకు మించి లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నటుడిని, కాబోయే నాయకుడిని చూడాలనే ఆరాటంలో జనసందోహం ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

"నా కాళ్లపై పడి క్షమాపణ కోరారు"

ఈ దుర్ఘటనలో తన బిడ్డను కోల్పోయిన ఒక తల్లి, ఆనాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ తర్వాత విజయ్ ప్రవర్తన తనను ఎంతగా కదిలించిందో ఆమె వివరించారు: "నా బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు.. సాక్షాత్తు విజయ్ గారు మా ఇంటికి వచ్చారు. అంత పెద్ద స్టార్ హోదాలో ఉండి కూడా ఆయన ఏమాత్రం సంకోచించకుండా నా కాళ్లపై పడి క్షమాపణ చెప్పారు. జరిగిన దానికి తనను క్షమించమని వేడుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఒక అవకాశం ఇవ్వాలని కోరారు." అని చెప్పారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా బాధిత కుటుంబాలకు విజయ్ వ్యక్తిగతంగా భారీ ఆర్థిక సాయం అందించడంతో పాటు.. వారి పిల్లల చదువులకు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.

మార్పు కోసమే ఈ తీర్పు!

విజయ్ చూపిన ఆ వినయం, బాధ్యతాయుత ప్రవర్తనే ఈ ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. "ఆయనలో ఉన్న నిజాయితీని మేము నమ్మాం... "రాజకీయాల్లో మార్పు కోసమే మేమంతా ఏకమై ఆయనకు ఓటేశాం.’’ అని తెలిపారు. "ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పనిచేస్తారని నమ్ముతున్నాం." అని ధీమా వ్యక్తం చేశారు.

భద్రతా ఏర్పాట్లపై చర్చ

విజయ్ మానవత్వంపై ప్రశంసలు కురుస్తున్నప్పటికీ మరోవైపు భారీ బహిరంగ సభల నిర్వహణలో భద్రతా లోపాలపై కూడా చర్చ సాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఏదేమైనా ఒక సామాన్య మహిళ కాళ్లపై పడి క్షమాపణ కోరిన విజయ్ వ్యక్తిత్వం, ఆయనను కేవలం నటుడిగానే కాకుండా ఒక ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలబెట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చూడాలి.