400 మైళ్ల దూరం నుంచి... ఇరాన్ పై అమెరికా ఎలా దాడి చేసిందంటే..!
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 1:03 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇరాన్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న కీలకమైన ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని అమెరికా నాశనం చేసింది. ఈ విషయాన్ని ట్రంప్ వెల్లడించారు. దీంతో.. అసలు ఈ మిషన్ ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... ఎవరూ ఊహించని రీతిగా అన్నట్లుగా పశ్చిమాసియాలో భీకరంగా జరుగుతున్న ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఇరాన్ లోని మూడు అణుశుద్ధి కేంద్రాలపై భీకర దాడులు చేసింది. ఇరాన్ గగనతలం లోకి ప్రవేశించకుండానే ఈ దాడులు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఇది తమ సైనిక విజయమని అన్నారు.
వాస్తవానికి ఇరాన్ పై అమెరికా మరో రెండు వారాల వరకూ దాడులు చేయదన్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈలోపే ట్రంప్ పని పూర్తి చేసేశారు. దీనికోసం ఆరు బీ-2 స్టెల్త్ బాంబర్లు 12 బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు అమెరికా మీడియా సంస్థ సీ.ఎన్.ఎన్. రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. వీరిలో రెండింటిని నంతాజ్ పై వాడినట్లు తెలిపింది.
ఇదే సమయంలో... ఇస్ఫహాన్, నతాంజ్ పై అమెరికా సబ్ మెరైన్ సుమారు 400 మైళ్ల దూరం నుంచి 30 టోమహాక్ క్షిపణులను ప్రయోగించాయి. ఈ క్రమంలో ముందుగా... ఆరు బీ-2 బాంబర్స్ నాన్ స్టాప్ గా 37 గంటలు ప్రయాణించాయి. ఈ క్రమంలో మార్గమధ్యలో పలుమార్లు గాల్లోనే ఇంధనం నింపుకుంటూ వెళ్లాయి.
వాస్తవానికి తొలుత ఫోర్డోపై దాడికి ఒక్కోటి 13,600 కిలోల బరువుండే రెండు జీబీయూ-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే... ఈ ఆపరేషన్ లో ఏకంగా ఆరింటిని ప్రయోగించడం గమనార్హం.
ఈ క్రమంలో 13,600 కిలోల బరువు, 20 అడుగుల పొడవు ఉండే ఈ బంకర్ బస్టర్ బాంబులలో.. తొలుత ఒక బాంబును ప్రయోగించి కొంత లోతు వరకూ ధ్వంసం చేసిన తర్వతా.. మరో బస్టర్ ను అక్కడే ప్రయోగించి మరింత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేశారని అంటున్నారు. దీంతో.. ఫోర్డ్ అణుశుద్ధి కేంద్రం పూర్తిగా నాశనమైందని చెబుతున్నారు.
