Begin typing your search above and press return to search.

ఉండవల్లి మీద తమ్ముళ్ల భగభగ....!

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇపుడు టీడీపీ తమ్ముళ్లకు టార్గెట్ అవుతున్నారు. ఎంతలా అంటే వైసీపీతో సరిసమానంగా అని చెప్పకతప్పదు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 6:10 PM GMT
ఉండవల్లి మీద తమ్ముళ్ల భగభగ....!
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇపుడు టీడీపీ తమ్ముళ్లకు టార్గెట్ అవుతున్నారు. ఎంతలా అంటే వైసీపీతో సరిసమానంగా అని చెప్పకతప్పదు. వైసీపీ ప్రభుత్వం అయితే చంద్రబాబుని సీఐడీ విచారణతో అరెస్ట్ చేయించి జైలుకు పంపేలా చేసింది. దాని మీదనే చంద్రబాబు తరఫున న్యాయవాదులు కిందా మీద అవుతున్నారు. క్వాష్ పిటిషన్ ద్వారా బాబుని ఈ కేసు నుంచి శాశ్వతంగా బయటకు తీసుకుని రావాలని చూస్తున్నారు.

అయితే సడెన్ గా ఎవరూ ఊహించని విధంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఏకంగా సీబీఐ కానీ ఈడీ కానీ రంగంలోకి దిగాలంటూ హై కోర్టు లో రిట్ పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. నిజానికి ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషన్ ను హైకోర్టు రిజిస్ట్రీ చీఫ్ జస్టిస్ బెంచ్ కు కేటాయించింది. అయితే, ఈ పిల్ ను విచారించేందుకు తమ ఇద్దరు జడ్జిల్లో ఒకరికి అభ్యంతరం ఉందని చీఫ్ జస్టిస్ తెలిపారు. వెంటనే పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.

ఇక ఉండవల్లి దాఖలు చేసిన రిట్ పిటిషన్ చూసినట్లు అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసు పరిధి చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ స్కాం లో నిధులను పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇది చాలా పెద్ద గుట్టు అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇవన్నీ బయట పడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని తెలిపారు. సీబీఐ దర్యాప్తులోనే నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

దీంతో హై కోర్టు ఈ కేసుని విచారణకు స్వీకరించడం ఇపుడు మరో బెంచ్ కి బదిలీ చేయడం చూస్తూంటే ఏపీ సీఐడీ కంటే ఇదే అసలైన గుబులుగా తమ్ముళ్ళకు ఉందని అంటున్నారు. హైకోర్టు విచారణలో ఎలాంటి అంశాలు తెర మీదకు వస్తాయో అన్న కల్వరం కూడా ఉంది. ఇక హై కోర్టు కనుక సీబీఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం అపుడు అసలైన కధ అని అంటున్నారు.

ఇక లాక్కోలేక పీక్కోలేక నానా తంటాలు పడాల్సి ఉంటుందని అంటున్నారు ఇలా టైం చూసి ఉండవల్లి ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో తమ్ముళ్ళు మండిపడుతున్నారు. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ అయిన అయ్యన్నపాత్రుడు అయితే ఉండవల్లి ఏకవచనంతో సంభోదిస్తూ ఘాటైన కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వం లో అన్నీ నీతిగా కనిపిస్తున్నాయా అని మండిపడ్డారు. ఉండవల్లి వన్ సైడెడ్ గా వైసీపీకి వత్తాసుగా మారిపోయారని ఆయన నిందించారు.

మొత్తానికి వైసీపీ కంటే పెద్ద ముప్పుని తమ నాయకుడిని తెచ్చిపెడుతున్నారు ఉండవల్లి అన్న ఆగ్రహం అయితే తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. ఇక స్వతహాగా లాయర్ అయిన ఉండవల్లి ఆర్ధిక విషయాల్లో సైతం ఆరితేరిన వారు అని అంటారు. ఆయన కనుక కేసులో న్యాయం ఉందని టేకప్ చేస్తే మాత్రం అది కచ్చితంగా ముందుకే వెళ్తుంది అంటారు. దాంతో తమ్ముళ్లు కలవరపడుతున్నారు అని అంటున్నారు.