కిస్సింగ్ మై.. ప్రపంచ నాయకులను ఎగతాళి చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలకలం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 9 April 2025 4:20 PMఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలకలం రేపుతున్నాయి. అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతుండగా, ట్రంప్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచ నాయకులను ఎగతాళి చేశారు. "ఈ దేశాలు మాకు ఫోన్ చేస్తున్నాయి.టారిఫ్ లపై మా కాళ్లు కూడా మొక్కడానికి రెడీ అవుతున్నాయి. " అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
హౌస్ రిపబ్లికన్ల కోసం జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ నాయకులను ఎగతాళి చేస్తూ "దయచేసి, దయచేసి, అయ్యా, ఒక ఒప్పందం చేసుకోండి. నేను ఏదైనా చేస్తాను. నేను ఏదైనా చేస్తాను, అయ్యా" అంటూ బతిమిలాడుతున్నారని వారిని ట్రంప్ అనుకరిస్తూ ఎద్దేవా చేశారు..
అమెరికా ప్రభుత్వం చైనాపై ఏకంగా 104% దిగుమతి సుంకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. కాంగ్రెస్ చర్చలు చేపట్టాలని సూచించిన సొంత పార్టీ రిపబ్లికన్లను కూడా ట్రంప్ ఎగతాళి చేయడం గమనార్హం.
అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న 34% ప్రతీకార సుంకాలను మంగళవారం నాటికి తగ్గించాలని చైనా కోరింది. అయితే, చైనా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని అమలు చేశారు.
ఔషధాలపై కూడా సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. "మనం సొంతంగా మందులు తయారు చేయము; అవి ఇతర దేశాలలో తయారవుతున్నాయి. అమెరికాలో అదే ప్యాకెట్ ధర కొన్నిసార్లు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఫార్మాపై మనం సుంకాలు విధిస్తాము, తద్వారా కంపెనీలు చాలా త్వరలో మన వద్దకు పరుగులు తీస్తాయి. మనకున్న ప్రయోజనం ఏమిటంటే, మనం చాలా పెద్ద మార్కెట్" అని ఆయన అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు.. చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.