ట్రంప్ ని అలా వదిలేయకండి.. ఎవరికైనా చూపించండి!
బుధవారం నెదర్లాండ్స్ లోని హేగ్ లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
By: Tupaki Desk | 26 Jun 2025 10:10 AM ISTప్రపంచంలో ఎవరు ఏమైపోయినా.. ఎవరు ఏమనుకున్నా.. తాను అనుకున్న పని తాను చేస్తానని.. తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని.. జనాలు నవ్వుకున్నా, తిట్టుకున్నా తనకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి అనే మాటలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మరోసారి మోడీకి మండే మాటలు మాట్లాడారు ట్రంప్.
అవును... భారత్ - పాకిస్థాన్ ల మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనిపై జీ7 సదస్సు వేదికగా పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మోడీ క్లారిటీ ఇచ్చారు. అనంతరం ట్రంప్ మాట మార్చారు.. సీజ్ ఫైర్ కు ఆ ఇరు దేశాలే కారణమని సైడ్ అయిపోయారు. కట్ చేస్తే తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నెదర్లాండ్స్ లోని హేగ్ లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... తాజాగా ముగిసిన ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం.. అవిరామంగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య వార్ గురించి ప్రస్తావించారు. అయితే వాటన్నింటికంటే భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపడం ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా... తాను వరుస ఫోన్ కాల్స్ తో యుద్ధం ముగించానని.. మీరు ఒకరితో ఒకరు పోరాడితే తాము ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని భారత్, పాక్ దేశాలకు తేల్చిచెప్పానని అన్నారు. అనంతరం మోడీ తనకు గొప్ప స్నేహితుడని.. పాక్ జనరల్ ఆకట్టుకునే వ్యక్తి అని చెప్పిన ట్రంప్.. వారు కూడా వాణిజ్య ఒప్పందమే కావాలని చెప్పారని పేర్కొన్నారు.
ఆ విధంగా భారత్ – పాక్ ల మధ్య అణుయుద్ధాన్ని తాము ఆపామని డొనాల్డ్ ట్రంప్ నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. దీంతో... ట్రంప్ వ్యవహారశైలిపై నెట్టింట సెటైర్లు పడుతున్నాయి. ఇందులో భాగంగా... ట్రంప్ ని అలా వదిలేయకండి.. ఎవరికైనా చూపించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
దీంతో... ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణింస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేసింది. ఈ సందర్భంగా... ట్రంప్ మాట్లాడిన వీడియోను 'ఎక్స్'లో పోస్టు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్.. మే 10 నుంచి ట్రంప్ ఇలా చెప్పడం 18వసారి అని అసహనం వ్యక్తంచేశారు. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని భారత ప్రయోజనాలను తుంగలోతొక్కారని ఆ పార్టీ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
