న్యూ*డ్ ఫొటో.. ట్రంప్ తో పెట్టుకుంటే అట్లుంటది మరీ
ఈసారి ట్రంప్ను వార్తల్లో నిలిపింది ఒక నగ్న చిత్రం, జెఫ్రీ ఎప్స్టైన్కు పంపిన లేఖ, ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్పై దాఖలు చేసిన భారీ పరువు నష్టం దావాతో హీట్ పెరిగింది..
By: Tupaki Desk | 19 July 2025 4:53 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారారు. ఈసారి ట్రంప్ను వార్తల్లో నిలిపింది ఒక నగ్న చిత్రం, జెఫ్రీ ఎప్స్టైన్కు పంపిన లేఖ, ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్పై దాఖలు చేసిన భారీ పరువు నష్టం దావాతో హీట్ పెరిగింది.. ఈ మొత్తం వ్యవహారం అమెరికా రాజకీయాలు, మీడియా, న్యాయ వ్యవస్థల్లో ఒక సంచలనం సృష్టిస్తోంది.
- వార్తల్లో ఏముంది?
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.., 2003లో జెఫ్రీ ఎప్స్టైన్ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఒక శుభాకాంక్షల లేఖను పంపారు. ఆ లేఖలో ఒక మహిళ నగ్న చిత్రాన్ని చేర్చి, దానిపై ట్రంప్ సంతకం చేసి, "హ్యాపీ బర్త్డే.. నీ ప్రతి రోజు ఓ అందమైన రహస్యంగా మారాలని ఆకాంక్షిస్తున్నా" అని రాశారని ఆ కథనంలో పేర్కొంది. ఈ ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తనపై అవాస్తవ ప్రచారం చేశారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ మాతృసంస్థ న్యూస్ కార్పొరేషన్, దాని యజమాని రూపర్ట్ మర్దోక్, సీఈఓ రాబర్ట్ థామ్సన్తో పాటు ఇద్దరు జర్నలిస్టులపై ₹86,000 కోట్ల (దాదాపు 10 బిలియన్ డాలర్ల) పరువు నష్టం దావా వేస్తూ మియామీ ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేశారు.
- ట్రంప్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?
ట్రంప్ తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, ఆర్థిక నష్టం కూడా వాటిల్లిందని ఆరోపిస్తున్నారు. రాజకీయంగా కీలకమైన ఈ సమయంలో ఇలాంటి వివాదాలు ఆయన ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగిస్తాయని ఆయన భావిస్తున్నారు. అందుకే, వాల్ స్ట్రీట్ జర్నల్పై ఇంత పెద్ద మొత్తంలో దావా వేసి, తన తీవ్రమైన వైఖరిని తెలియజేశారు.
-జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్ సంబంధాలు.. పాత జ్ఞాపకాలు
ట్రంప్ గతంలో జెఫ్రీ ఎప్స్టైన్ను గురించి మాట్లాడుతూ “అతడు అద్భుతమైన వ్యక్తి. అతనికి కూడా నాకు లాగే అందమైన యువతులు, బాలికలు ఇష్టమయ్యేవి” అని వ్యాఖ్యానించారు. అయితే, ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తడంతో 2006లో అతనితో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ చెప్పారు. ఎప్స్టైన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2019లో అతడిని అరెస్టు చేసినా, అదే ఏడాది ఆగస్టులో న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ కేసు రాజకీయ, మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ట్రంప్-ఎప్స్టైన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నుండి 2000 మధ్య ఫ్లోరిడాలో ఇద్దరూ పక్కపక్కనే నివసించేవారంటూ పేర్కొన్నారు. ఇవన్నీ ట్రంప్కు వ్యతిరేకంగా ఈ ప్రస్తుత వివాదాన్ని మరింత రాజేస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో అనేక ప్రశ్నలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్న విధంగా, ట్రంప్ నిజంగా ఆ లేఖను పంపారా? ఆ లేఖకు సంబంధించిన ఆధారాలు ఏవి? అన్నది ప్రశ్న. వార్తా సంస్థ ఈ సంచలన కథనాన్ని ప్రచురించడానికి ముందు ఏ రకమైన ఆధారాలను సేకరించింది? అవి ఎంతవరకు విశ్వసనీయమైనవి? అన్నది చూసుకోవాలి. ట్రంప్ దాఖలు చేసిన ₹86,000 కోట్ల పరువు నష్టం దావా న్యాయస్థానంలో నిలుస్తుందా? దీనికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ఎలా సాగుతుందన్నది చూడాలి. ఈ వివాదం ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీడియా వర్గాల్లో ఇది ఎలాంటి చర్చకు దారి తీస్తుంది? అన్నది వేచిచూడాలి.
ఇది ట్రంప్కు వచ్చిన మరో వివాదంగా మారింది. ఒకవైపు అధ్యక్షుడు, మరోవైపు అమెరికా ప్రధాన మీడియా సంస్థల మధ్య హై-ప్రొఫైల్ పోరు మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం అమెరికా రాజకీయ, న్యాయ, మీడియా రంగాలలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. నిజం ఏదైనా, ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.
