తమిళ రాజకీయానికి త్రిష్ టార్గెట్ ఎందుకు...?
దశాబ్దాలుగా వెండితెరపై స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారారు.
By: Garuda Media | 16 Feb 2026 9:00 PM ISTదశాబ్దాలుగా వెండితెరపై స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారారు. సినిమా గ్లామర్ పవర్ మధ్య ఉండే సన్నని గీతను ఆసరాగా చేసుకుని కొంతమంది నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని హననం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రచార పిచ్చితో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా చులకనగా మాట్లాడటం తమిళనాట దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ప్రత్యర్థులను దెబ్బకొట్టే క్రమంలో ఆమె పేరును వివాదాల్లోకి లాగడం ఒక వికృత సంప్రదాయంగా మారుతోంది. ఇది కేవలం త్రిష వ్యక్తిగత గౌరవానికే కాకుండా మొత్తం సినీ రంగానికి అవమానంగా పరిణమించింది.
గతంలో సేలం వెస్ట్ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎంతటి నైచ్యం ఉందో నిరూపించాయి. కూవత్తూరు రిసార్ట్ రాజకీయాల సమయంలో ఒక కీలక నేత కోసం త్రిషను తీసుకువచ్చారంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఒక మహిళా నటి ప్రతిష్టను బజారుకు ఈడ్చడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే అని అర్థమవుతోంది. దీనిపై త్రిష ధైర్యంగా స్పందిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధపడ్డారు. అలాగే నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మహిళా వ్యతిరేకతకు పరాకాష్టగా నిలిచాయి. లియో సినిమాలో ఆమెతో రేప్ సీన్ ఉంటుందని ఆశించానని ఆయన బహిరంగంగా చెప్పడం వికృత మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి సంఘటనలు సినీ పరిశ్రమలో మహిళల భద్రత, గౌరవంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తాజాగా తమిళనాడు బీజేపీ నేతలు సైతం రాజకీయ విమర్శల్లో త్రిషను పావుగా వాడుకోవడం మళ్లీ కాంట్రవర్సీకి కారణమైంది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీని టార్గెట్ చేసే క్రమంలో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయ్ ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే వాస్తవాలు తెలుస్తాయని చేసిన కామెంట్లపై టీవీకే శ్రేణులు మండిపడుతున్నాయి. రాజకీయ అనుభవం గురించి మాట్లాడేటప్పుడు సంబంధం లేని ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం దారుణమైన చర్య అన్న విమర్శలు వస్తున్్నాయి.
కేవలం రాజకీయ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఒక మహిళను కించపరచడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా త్రిష కెరీర్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయ నేతలతో పాటు పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కూడా ఆమెపై విషం చిమ్ముతున్నారు. మీరా మిథున్ వంటి వారు త్రిష తన అవకాశాలను లాగేసుకుంటోందని, నెపోటిజం మద్దతుతోనే ఆమె రాణిస్తోందని సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇన్ని వైపుల నుండి దాడులు జరుగుతున్నా త్రిష ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు.
ఒకప్పుడు నటీమణులను ఆరాధించిన తమిళ గడ్డపైనే నేడు వారిని రాజకీయ అవసరాల కోసం అవమానించడం ఆశ్చర్యకరం. సామాజిక బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు హుందాతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత దూషణలకు స్వస్తి పలికి విధానపరమైన విమర్శలు చేసినప్పుడే రాజకీయాలకు గౌరవం పెరుగుతుంది. తనపై వస్తున్న నిందలను తిప్పికొడుతూ త్రిష అడుగులు వేయడం ఇతర మహిళా నటులకు ధైర్యాన్ని ఇస్తోంది.
హీరో విజయ్ని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఆలోచనలో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్న వేళ త్రిష తన లీగల్ టీమ్తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నైనార్ నాగేంద్రన్పై లీగల్గా స్పందించింది. తాజాగా త్రిష తరుపు న్యాయవాది నిత్యేష్ నటరాజన్ కీలక ప్రకటన చేస్తూ లీగల్ యాక్షన్కు సంబంధించిన ఓ లెటర్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
అవమానం ఎప్పుడైనా అవమానమే. స్థానం పెద్దదైతే బాధ్యత కూడా పెద్దదే. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం లాగడటం సరైంది కాదు. గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కనీసం అవమానించకండి` అంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్పై ఫైర్ అయ్యారు. నా క్లైంట్ త్రిష కృష్ణన్ పేరు మోసిన ఇండియన్ యాక్టర్. నా క్లైంట్పై చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి ఆధారంగానే ఈ ప్రకటన చేస్తున్నాం.
నా క్లైంట్ త్రిష ఇలాంటి అవమానకరమైన అసహ్యమైన వ్యాఖ్యలని రాష్ట్ర రాజకీయాల్లో హై స్టేచర్ ఉన్న వ్యక్తి నుంచి వస్తాయని ఊమించలేదు. నా క్లైంట్ తను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీకి తాను సానుభూతి పరురాలి కూడా కాదని క్లియర్ చేసింది. అంతే కాకుండా గత కొంత కాలంగా ఇదే స్టాండ్ని మెయింటైన్ చేస్తూ వస్తోంది. అలాగే తను పాలిటిక్స్లోకి వస్తే సహజసిద్ధంగానే వ్యవహరిస్తుంది. ఓ ఆర్టిస్ట్గా తను తన క్రాఫ్ట్కు సంబంధించిన విషయాలపై డిఫైన్ చేస్తుందే కానీ ఎలాంటి పొలిటికల్ విషయాలపై జోక్యం చేసుకోదు.
మరీ ముఖ్యంగా వ్యక్తిగత విషయాలని పబ్లిక్ ప్లాట్ ఫామ్లలో చర్చించడం అనేది భావ్యం కాదు. అందులోనూ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు పబ్లిక్ ప్లాట్ఫామ్లలో మాట్లాడుతున్నప్పుడు బాధ్యతాయుతంగా, సమానత్వంతో వ్యవహరిచాలి. అని నా క్లైంట్ రిక్వెస్ చేస్తూ ఇకపై ఇలాంటి విషయాల్లో తన అనుమతి లేకుండా తన పేరుని వాడరాదని కోరుతోంది` అంటూ త్రిష లాయర్ నిత్యేష్ నటరాజన్ ఓ లెటర్ని విడుదల చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే ఎక్కడ విజయ్ పేరునిగాని తమిళనాగు బీజేపీ అద్యక్షుడి పేరు గానీ మెన్షన్ చేయకపోవడం గమనార్హం.
