ఏమిటీ టీఆర్ఎఫ్? ఎవరు దీన్ని క్రియేట్ చేసింది?
హిమాలయ మంచు శిఖరాల అందాల్నిఅస్వాదించేందుకు కశ్మీర్ కు వెళ్లిన విదేశీ.. స్వదేశీ యాత్రికులపై కాల్పులు జరిపి.. 27 మంది ప్రాణాల్ని తీసిన ‘పహల్గాం’ దారుణ ఘటనకు కారణం తామేనని ప్రకటించుకుంది ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ఉగ్ర సంస్థ.
By: Tupaki Desk | 23 April 2025 2:20 PM ISTహిమాలయ మంచు శిఖరాల అందాల్నిఅస్వాదించేందుకు కశ్మీర్ కు వెళ్లిన విదేశీ.. స్వదేశీ యాత్రికులపై కాల్పులు జరిపి.. 27 మంది ప్రాణాల్ని తీసిన ‘పహల్గాం’ దారుణ ఘటనకు కారణం తామేనని ప్రకటించుకుంది ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ఉగ్ర సంస్థ. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370 రద్దు చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేశారీ సంస్థను. తాజాగా పలువురు అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఈ ఉగ్రసంస్థకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.
కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తీసేస్తూ చేపట్టిన చర్యకు వ్యతిరేకంగా ఈ ఉగ్రసంస్థను ఏర్పాటు చేశారు. తొలుత ఆన్ లైన్ లో కార్యకలాపాలు నిర్వహించినా.. ఆ తర్వాత అది లష్కరే తోయిబా లాంటి పలు ఉగ్రసంస్థల సభ్యులను తీసుకొని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది.దీని వెనుక పాకిస్థాన్ ఉంది. దాయాదికి చెందిన గూఢాచార సంస్థ ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ ను క్రియేట్ చేసినట్లుగా చెబుతారు.
నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం చూపును మళ్లించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేయించినట్లుగా చెబుతారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల నేపథ్యంలో 2018లో ఆ సంస్థ నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్ ను ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని చెబుతారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఏడాదిలోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. అతడో కశ్మీరీ మిలిటెంట్. ఈ సంస్థ తొలిసారి శ్రీనగర్ లోని ప్రముఖ జర్నలిస్టు అయిన షుజాత్ బుఖారీ..అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని హతమార్చటానికి కుట్ర పన్నాడు. ఉగ్ర కార్యక్రమాలతోఉపా చట్టం కింద సజ్జాద్ ను ఉగ్రవాదిగా కేంద్రం ప్రకటించింది. ఇతడు గతంలో లష్కరే తోయిబా కమాండర్ గా పని చేసిన అనుభవం ఉంది. ఇతడితో పాటు.. లష్కరేలో పని చేసిన పలువురు ఇందులో చేరారు.
ఈ సంస్థ టార్గెట్ మొత్తం మతాల వారీగానే ఉంటుంది. కొన్ని మతాల్ని లక్ష్యంగా చేసుకున్న ఈ సంస్థ దాడి చేసి హతమార్చిన వారిలో ఎక్కువగా కశ్మీరీ పండిట్లు.. హిందువులు.. సిక్కులు ఉన్నారు. అంతేకాదు.. ముస్లింలు కూడా ఉండటం గమనార్హం. 2020 ఏప్రిల్ ఒకటో తేదీన నియంత్రణ రేఖ వెంట.. కుప్వారాలోని కేరన్ సెక్టార్ లో నాలుగు రోజులు ఎదురుకాల్పులు జరిగినప్పుడు తొలిసారిగా టీఆర్ఎఫ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే పలు దాడులకు పాల్పడి.. పలువురు ప్రాణాలు తీశారు. చివరగా వీరి ఉగ్ర కార్యకలాపాల్ని చూస్తే.. 2024 అక్టోబరు 20న గండేర్ బల్ లోని సోన్ మార్గ్ లో ఒక డాక్టర్.. ఆరుగురు వలస కార్మికులను హతమార్చారు.
ఈ సంస్థ తాము చేసే దారుణాలకు రిక్రూట్ మెంట్ ను సోషల్ మీడియాను వాడతారని చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సైకలాజికల్ మైండ్ గేమ్ పోస్టులు.. వీడియోలతో యువతను ప్రబావితం చేస్తుంటారు. ఇలా బ్రెయిన్ వాష్ చేసిన యువతతో ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తూ.. ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తుంటారు.
ఈ నేపథ్యంలో 2023లో ఈ సంస్థను భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ సంస్థకు షేక్ సజ్జద్ గుల్ సుప్రీం కమాండర్ గా వ్యవహరిస్తుంటే.. మరో ఉగ్రవాది బాసిత్ అహ్మద్ దార్ చీఫ్ ఆపరేషన్ల కమాండర్ గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు దాడులకు తెగబడ్డ ఈ సంస్థ అంతు చూడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఈ దాడికి సంబంధించి నిఘా వర్గాలకు సమాచారం ఉన్నప్పటికి.. ఎందుకు అడ్డుకోలేదన్నది విమర్శగా మారింది. ఈ అంశంపై ప్రధాని మోడీ సీరియస్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
