Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్తూ.. అనంతలోకాలకు.. ఏలూరు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

ముదినేపల్లి సమీపంలోని చినపాలపర్రు వద్ద జరిగిన ప్రమాదం గురించి వింటేనే వామ్మో అనిపిస్తుంది.

By:  Tupaki Political Desk   |   2 May 2026 3:30 PM IST
అమెరికా వెళ్తూ.. అనంతలోకాలకు.. ఏలూరు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!
X

శుభకార్యానికి వచ్చి సంతోషంగా తిరిగి వెళ్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఉన్నత చదువులు చదివి, అమెరికాలో స్థిరపడి, ఎంతో భవిష్యత్తు ఉన్న 27 ఏళ్ల యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత హృదయ విదారకం. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారి శనివారం (మే 2, 2026) తెల్లవారు జామున ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొని, తిరిగి తను ఉద్యోగం చేసే అమెరికాకు వెళ్లేందుకు బయలుదేరిన జయరాం (27), గమ్యం చేరకుండానే శాశ్వత సెలవు తీసుకున్నాడు. కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగిన ఈ ప్రమాదం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయరాం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.

ప్రమాదం జరిగిన తీరు

ముదినేపల్లి సమీపంలోని చినపాలపర్రు వద్ద జరిగిన ప్రమాదం గురించి వింటేనే వామ్మో అనిపిస్తుంది. వనదుర్రు గ్రామానికి చెందిన జయరాం శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్లేందుకు రోడ్డు మార్గంలో కారులో బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన అమెరికాకు విమానం ఎక్కాల్సి ఉంది. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో చిక్కుకున్న జయరాం అక్కడిక్కడే ప్రాణాలు విడువగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

చెదిరిన కలలు

జయరాం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే మంచి స్థాయిలో ఉన్న ఆయన, ఇంటికి వచ్చి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం స్థానికులను కలచివేసింది. శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో మృత్యువు కబళించడం ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

తెల్లవారుజాము ప్రయాణాలు

సాధారణంగా హైవేలపై జరిగే ప్రమాదాల్లో అధిక శాతం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్యే జరుగుతుంటాయి. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల లేదంటే తగినంత నిద్ర లేకపోవడం వల్ల డ్రైవర్లు ఈ సమయంలో నిద్రమత్తులోకి జారుకుంటారు. సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లకు విశ్రాంతి అవసరం. డ్రైవర్ నిద్రపోతున్నట్లు అనిపిస్తే వాహనాన్ని నిలిపి కాసేపు విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం.

జయరాం మరణంతో రహదారి భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. డ్రైవర్ల చిన్నపాటి నిర్లక్ష్యం లేదంటే నిద్రమత్తు నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా.., ఒక కుటుంబం ఆశలను అడియాశలు చేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు మాత్రమే కాదు, ఆశలు, ఆశయాలు కూడా నుజ్జునుజ్జవుతాయనడానికి ఈ ఘటనే సాక్ష్యం.