అక్కడ చనిపోయినవారు జీవించి ఉన్న మృతదేహాలు.. ఏమిటీ స్పెషల్!
ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జాతులు, సమూహాలు.. వారిలో ఎన్నో వేల రకాల ఆచార సంప్రదాయాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.
By: Raja Ch | 15 Oct 2025 10:08 AM ISTఈ ప్రపంచంలో ఎన్నో రకాల జాతులు, సమూహాలు.. వారిలో ఎన్నో వేల రకాల ఆచార సంప్రదాయాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో ఒకరి ఆచార వ్యవహారాలు మరొకరి వింతగా అనిపిస్తుంటాయి. మరికొంతమందికి షాకింగానూ అనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఇండోనేషియాలోని ఒక జాతి సమాజానికి సంబంధించిన అంత్యక్రియల ఆచారం అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది.
అవును... ఇండోనేషియాలోని ఒక జాతి సమాజం ఒక ప్రత్యేకమైన అంత్యక్రియల ఆచారాన్ని కలిగి ఉంటుంది. అక్కడ మరణించిన వారిని మమ్మీకరణ చేసి, తొంగ్కోనన్ అనే ప్రత్యేక గదులలో భద్రపరుస్తారు. ఈ ప్రాంత ప్రజలను 'తోరాజా' అని పిలుస్తారు. దీనిని "టు-ర్రాహ్-జా" అని ఉచ్ఛరిస్తారు, అంటే.. 'పర్వతాల నుండి వచ్చినవారు' అని అర్ధం!
శవాలను బయటకు తీస్తారు!:
వీరి ఆచారంలో మరణించిన కుటుంబ సభ్యుల శవాలను కాలానుగుణంగా బయటకు తీయడం, వాటిని శుభ్రపరచడం, తిరిగి దుస్తులు వేస్తారు. ఈ క్రమంలో కొందరు సిగరెట్లను నోటిలో పెట్టి, వాటిని తిరిగి వారి సమాధులలో భద్రపరుస్తారు. మృతదేహాలు బయటకు తీసినప్పుడు తమ బంధువుల సమాధులను శుభ్రం చేయడానికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు.
మరణం అంతం కాదని నమ్మకం!:
మరణం అంతం కాదనే నమ్మకం ఆధారంగా ఈ తరహా ఆచారం ప్రతి మూడు నుండి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆగస్టులో జరుగుతుంది. ఇది బంధువు మరణం తర్వాత ఒక కుటుంబం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. వీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్థిక పరమైన భారం కూడా ఉందని చెబుతారు. ఇక్కడ వేడుకగా చేసే అంత్యక్రియలకు సుమారు రూ.4 కోట్లకు పైగానే ఖర్చవుతుందని.. అంత ఖర్చు భరించలేక ఇలా మమ్మీకరణ చేసి భద్రపరుస్తారు!
పైగా పూర్వీకులను అప్పుడప్పుడు బయటకు తీసి, వారిని సంతోషంగా ఉంచడం వల్ల మంచి వరి పంట వస్తుందనే వారి పురాతన నమ్మకం ఆధారంగా, తమ సంఘం ఈ తరహా అంత్యక్రియలను నిర్వహిస్తుందని చెబుతుంటారు. మరణ కార్యక్రమం జరిగే వరకు చనిపోయినవారి ఆత్మ ప్రపంచంలోనే ఉంటుందని వీరు నమ్ముతారట.
క్రైస్తవ్యానికి వ్యతిరేకం!!:
1900ల ప్రారంభంలో డచ్ మిషనరీలు తోరాజన్ లను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించి కొంతమేర సక్సెస్ అయినట్లు చెబుతారు. అయితే వీరు ఆచరిస్తున్న ఈ సంప్రదాయం క్రైస్తవ మతానికి అనుకూలంగా లేదనే చెప్పాలి! దీని ప్రకారం మరణం అనేది భౌతిక జీవితం నుండి స్వర్గంలో శాశ్వత జీవితానికి లేదా దేవుని నుండి శాశ్వతంగా విడిపోయి నరకానికి చేరడానికి దారితీస్తుంది.
మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభాకు నిలయమైన ఇండోనేషియా ఇస్లాం కూడా ఈ తరహా పూర్వీకుల ఆరాధనగా భావించే విధానాన్ని ఆమోదించదు! ముస్లింలు ఖియామత్ లేదా తీర్పు అనే భావనను నమ్ముతారు.. జీవితంలో వారి వారి పనులు, వారి వారి చర్యల ప్రకారం అల్లాహ్ తీర్పు ఇస్తారు.
ప్రధాన పంట వరి!:
ఇక ఈ తోరాజ ప్రజలు ఇప్పటికీ గ్రామీణ సమాజలోనే ఉన్నారు. వీరు ప్రధానగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వీరి ప్రధాన ఆహారం వరి కాగా... ప్రధాన వాణిజ్య పంట కాఫీ. అయితే... వరితో పాటు మొక్కజొన్న, మిల్లెట్లను కూడా పండిస్తుంటారు.
