AI టెక్నాలజీతో దర్శనం.. యాంటీ డ్రోన్ సిస్టంతో ఆలయ రక్షణ
తిరుమల ఆలయంలో భద్రత, భక్తులకు మెరుగైన సేవలు అందజేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
By: Tupaki Desk | 22 May 2025 11:30 AMతిరుమల ఆలయంలో భద్రత, భక్తులకు మెరుగైన సేవలు అందజేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరకుండా నిరోధించడానికి యాంటీ డ్రోన్ సిస్టం వాడాలని తాజాగా నిర్వహించిన పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడంలో భాగంగా AI టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. ఇందుకోసం గూగుల్ తో ఒప్పందం కుర్చుకున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు.
కలియుగ వైకుంఠంగా ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ నిర్వహణకు టెక్నాలజీ వాడాలని టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు భావిస్తున్నారు. ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే AI టెక్నాలజీ వాడుకుని దర్శనాల సమయం తగ్గించే అవకాశాలను పరిశీలించారు. గత ఏడాది డిసెంబరులో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఏఐ ద్వారా రెండు గంటల్లోనే దర్శనం చేసుకునే అవకాశం ఉందని గుర్తించారు. అయితే మెరుగైన సేవలతో పాటు సాంకేతికంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటంలో భాగంగా AI సాంకేతికతను మరింత మెరుగైన విధంగా తయారు చేయించాలని భావించారు. గూగుల్ తోపాటు భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ఈ అంశమై ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది.
శ్రీవారి దర్శనంతోపాటు గదుల కేటాయింపు, టికెట్ల విక్రయం టోకెన్ల జారీలో మోసాలను నియంత్రించడానికి టెక్నాలజీ సహకారం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. భక్తులకు ముఖ గుర్తింపు ద్వారా దర్శనాలకు అనుమతించడం ఇందులో ప్రధానమైనదిగా చెబుతున్నారు. ముందుగా ఫేస్ రికగ్నైషన్ తీసుకుని దర్శనం స్లాట్ కేటాయించడం ద్వారా భక్తులు వేగంగా దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, ఇతర కీలక ప్రాంతాల్లో భక్తుల ఫేస్ రికగ్నైషన్ ద్వారా మెరుగైన సేవలు అందజేయొచ్చని చెబుతున్నారు.
అంతేకాకుండా AI ద్వారా శక్తిమంతమైన కెమెరాలు రియల్ టైమ్ ఫేసియల్ డిటెక్షన్ తోపాటు యాత్రికుల కదలికలను ట్రాక్ చేస్తాయి. ఎక్కడైనా జన సమూహం ఎక్కువగా ఉంటే అందుకు గల కారణాలను చిటికెలోనే యంత్రాంగానికి తెలిసిపోతుంది. దీనివల్ల రద్దీ నియంత్రణను సమర్థంగా నిర్వహించవచ్చని చెబుతున్నారు. క్యూలైన్ కదిలే సమయంతో తదుపరి దర్శనాలకు ఎంత సమయం పడుతుంది. కచ్చితంగా ఏ సమయంలో క్యూలైన్ లోకి రావాలనేది రియల్ టైమ్ లో తెలియజేస్తుందని అంటున్నారు. దీనివల్ల భక్తులు తమ యాత్ర ప్రణాళికలను ఎప్పటి కప్పుడు మెరుగుపరుచుకోవచ్చని చెబుతున్నారు.