Begin typing your search above and press return to search.

తిరుమలలో చిరుత దాడి.. షాకింగ్ వీడియో వైరల్

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి అలిపిరి మార్గంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుత దాడికి యత్నించగా.. తృటిలో పెను ప్రమాదం తప్పింది

By:  Tupaki Desk   |   26 July 2025 12:23 PM IST
Man Escapes Wild Attack on Alipiri Road
X

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి అలిపిరి మార్గంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుత దాడికి యత్నించగా.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తిరుమలలో అటవీ జంతువుల సంచారం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి తిరుమల వైపు అలిపిరి మార్గంలోని జూ పార్క్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్తుండగా, క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో పొదల వెనుక నుంచి ఒక్కసారిగా ఓ చిరుత దూసుకొచ్చింది. అయితే బైక్ వేగంగా ఉండటం, ఆ వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో చిరుత దాడి నుంచి బయటపడగలిగాడు. ఈ దృశ్యాలు వెనుక వస్తున్న కారులో అమర్చిన డాష్‌కామ్‌లో రికార్డ్ అయ్యాయి.

టీటీడీ హెచ్చరికలు బేఖాతరు.. రాత్రి ప్రయాణాలు ప్రమాదకరం

టీటీడీ భద్రతాధికారులు ఇప్పటికే అలిపిరి మార్గంలో రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దని స్పష్టమైన సూచనలు జారీ చేశారు. అయినప్పటికీ, చాలామంది భక్తులు, స్థానికులు రాత్రివేళల్లో బైక్‌లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఇది చిరుతల సంచారానికి అవకాశమివ్వడంతో పాటు, భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది. అటవీ జంతువుల సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో రాత్రి ప్రయాణాలు నివారించడం అత్యవసరం.

-అటవీ శాఖ అప్రమత్తం: భద్రతా చర్యల పటిష్టత అవసరం

గత కొంతకాలంగా తిరుమల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీవారి మెట్టు మార్గం తదితర చోట్ల చిరుతలు, ఇతర అటవీ జంతువులు తరచుగా కనిపిస్తున్నాయి. గతంలో చిరుతల కదలికలపై నిఘా ఉంచేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులను గుంపులుగా పంపే విధానాన్ని కూడా అమలులోకి తెచ్చారు. కొంతకాలం చిరుతల సంచారం తగ్గినట్లు కనిపించినప్పటికీ, తాజా ఘటనతో మళ్లీ తిరుపతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు, టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుమల వెళ్లే భక్తులు, స్థానికులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకించి రాత్రివేళ ప్రయాణాలను పూర్తిగా నివారించాలి. అటవీ శాఖ, భద్రతా సిబ్బంది మరింత సమగ్ర చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలను నివారించగలం.