లడ్డూ వివాదం.. తెగేదాకా లాగితే.. !
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న వివాదం నానాటికీ ముదురుతోంది. దీనిపై సీబీఐ అధికారుల నేతృత్వంలో ఇప్పటికే 2024-2026 జనవరి వరకు విచారణ జరిగింది.
By: Garuda Media | 6 Feb 2026 9:00 PM ISTతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న వివాదం నానాటికీ ముదురుతోంది. దీనిపై సీబీఐ అధికారుల నేతృత్వంలో ఇప్పటికే 2024-2026 జనవరి వరకు విచారణ జరిగింది.దీనికి సంబంధించిన నివేదిక కూడా కోర్టుకు చేరింది. అయితే.. దీనిలో ప్రధానంగా నెయ్యి కల్తీ జరిగిందని సిట్ పేర్కొంది. అయితే.. దానిలో జంతువుల కొవ్వు కలిసిందా..? లేదా? అనేవిషయంలో సందేహం వ్యక్తం చేసింది.
ఇక, ఈ నివేదిక తమకు అనుకూలంగా ఉందని.. జంతువుల కొవ్వు కలవలేదని సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇక్కడ నుంచి మరోసారి లడ్డూ లడా యి పుంజుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధంతోపాటు.. దాడుల వరకు ఈ వ్యవహారం దారి తీసింది. ఈ నేపథ్యంలో వాస్తవానికి కూటమి ప్రభుత్వం.. ప్రస్తుత సీబీఐ నివేదిక కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. దీనిని తర్వాత తేల్చుకుంటామని చెప్పి ఉంటే ఇంత వివాదం ఉండేది కాదు.
ఇదేసమయంలో వైసీపీ చేసే ఎదురుదాడికి విషయం ఆధారంగా కౌంటర్ ఇచ్చినా బాగుండేది. మరికొన్ని రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆదిశగా చర్చలను దారి మళ్లించి ఉన్నా.. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోయేది. కానీ, ప్రభుత్వం అలా చేయడం లేదు. పైగా.. ఇప్పుడు ప్రత్యేక కమిషన్ వేసి.. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తామని ప్రకటించింది. కానీ, ఈ వ్యవహారం కూడా అంత తేలికగా ముగిసే పరిస్థితి లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కోర్టులో ఉన్న సీబీఐ నివేదికపై విచారణ పూర్తి అయి.. కోర్టులు తీర్పులు ఇచ్చాక మాత్రమే ప్రత్యేక కమిషన్ వేసేందుకు రాష్ట్ర సర్కారుకు అవకాశం ఉంటుంది. కానీ, ఇది జరిగే సరికి మరో ఏడాది సమయం పట్టనుంది. ఆ తర్వాత.. కమిషన్ వేసినా.. అది కూడా నోటి మాటగా విచారణ పూర్తి చేసే అవకాశం లేదు. ఏదైనా కూడా ల్యాబులపైనా.. అవి ఇచ్చే నివేదికలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. సో.. మొత్తంగా చూస్తే.. ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగితే.. సమయం వృథా తప్ప.. పెద్దగా కూటమికి ప్రయోజనం ఉంటుందా? అనేది చూడాలి.
