రోడ్డుపై పడుకొని భూమన హైడ్రామా
తిరుమలలోని ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 April 2025 7:26 AMతిరుమలలోని ఎస్వీ గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయనపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, గోవుల అంశంపై అసత్య ప్రచారం చేసిన జగన్, భూమన గోశాలకు రావాలని టీడీపీ సవాల్ విసిరింది. దీంతో, ఈ రోజు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దామని భూమన ఆ సవాల్ ను స్వీకరించారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
గోశాలకు ర్యాలీగా భూమన కరుణాకర్ రెడ్డి బయలుదేరారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు దానిని అడ్డుకున్నారు. అంతేకాదు, కేవలం భూమనను మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెబుతున్నారు. అయితే, భూమన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి నారాయణ స్వామి, వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా లోపలికి వెళతామని పట్టుబట్టగా వారికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో, గురుమూర్తితో పాటు భూమన రోడ్డుపైనే పడుకొని నిరసన తెలుపుతున్నారు.
ఇక, తిరుమల గోశాలను సీఐపీ నేత నారాయణ నిన్న పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. గోశాలలో గోవులు చనిపోయాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు. గోశాలలో కావాల్సినంత దాణా ఉందని, గోవులు పుష్టిగా ఉన్నాయని నారాయణ అన్నారు. రాజకీయాలకు టీటీడీని వాడుకోవాలనుకోవడం సహేతుకం కాదని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.
భూమన రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నిజంగా సవాల్ ను భూమన స్వీకరించి ఉంటే ఆయన ఒక్కరే గోశాల లోపలికి వెళ్లి పరిశీలించి ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు. అలా కాకుండా...డ్రామా కోసమే రోడ్డుపై పడుకున్నారని విమర్శిస్తున్నారు.