Begin typing your search above and press return to search.

ఫ్యాక్ట్ చెక్ : తిరుమల గోశాలలో గోవుల మరణం.. ప్రచారంలో నిజమెంత?

ఈరోజు ఉదయం వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. తిరుమలలోని గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయని ఆ పార్టీ ఆరోపించింది.

By:  Tupaki Desk   |   12 April 2025 12:32 PM IST
TTD Goshala Controversy
X

తిరుమల పుణ్యక్షేత్రం ఎల్లప్పుడూ రాజకీయ వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వస్తోంది. హిందూ సమాజంలో అత్యంత పవిత్ర స్థలమైన తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరైనది కానప్పటికీ, గతంలో అనేక సందర్భాల్లో ఇది జరిగింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఒకప్పుడు సంచలనం సృష్టించిన పింక్ డైమండ్ వివాదం తరువాత, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) గోశాల సమస్యను తెరపైకి తీసుకువచ్చింది.


ఈరోజు ఉదయం వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను విడుదల చేసింది. తిరుమలలోని గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయని ఆ పార్టీ ఆరోపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని వైసీపీ పేర్కొంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే వైసీపీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే టీటీడీ వెంటనే ఈ ఆరోపణలను ఖండించింది. కొద్దిసేపటి తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ "టీటీడీ గోశాలల్లో ఆవులు మరణించాయని సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన.. దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. టీటీడీ వాస్తవాలను స్పష్టం చేసింది. వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి.. రెచ్చగొట్టడానికి చేస్తున్న ఈ తప్పుడు కథనాన్ని నమ్మవద్దని భక్తులను కోరుతున్నాను" అని స్పష్టం చేశారు.

గతంలో వైసీపీ పాలనలో తిరుమల లడ్డూల నాణ్యతపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై విచారణ జరిపి కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ ఘటన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై ఎదురుదాడి చేసేందుకే వైసీపీ ఇప్పుడు గోశాల అంశాన్ని తెరపైకి తెచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలలో పింక్ డైమండ్ అదృశ్యం అయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. చివరికి, ఆ ఆరోపణలు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేసిన నిరాధారమైన ప్రచారమని తేలింది.

ఇప్పుడు వైసీపీ గోశాల సమస్యను తెరపైకి తీసుకురావడం గమనార్హం. గతంలో పింక్ డైమండ్ ఆరోపణలపై చంద్రబాబు నాయుడు స్పందించడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, ఈసారి ఆయన ప్రభుత్వం వెంటనే స్పందించి వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాజకీయంగా తిరుమలను ఉపయోగించడం ఎప్పటికీ మంచిది కాదని, ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా తిరుమల గోశాలపై ఎవరికి తోచిన విధంగా వైసీపీ, టీడీపీలు ఆరోపణలు, కౌంటర్లు చేస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.