Begin typing your search above and press return to search.

దేశంలో తొలిసారి ఎగిరిన ఈ విమానం ప్రత్యేకతలు ఇవే!

ఈ కంపెనీకి చెందిన విమానాలను కొనుగోలు చేసిన భారత విమానయాన సంస్థ.. ఎయిర్‌ ఇండియా మనదేశంలో తాజాగా ఎయిర్‌ బస్‌ సేవలను ప్రారంభించింది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 11:30 PM GMT
దేశంలో తొలిసారి ఎగిరిన ఈ విమానం ప్రత్యేకతలు ఇవే!
X

మనదేశంలో మరో కొత్త కంపెనీకి చెందిన విమానం తొలిసారి ఎగిరింది. దీంట్లో ఏం ప్రత్యేకత ఉందనుకుంటున్నారా.. మిగిలిన కంపెనీల విమానాలతో పోలిస్తే తాజా కంపెనీ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఏవియేషన్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్‌ బస్‌.. ఈ కంపెనీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ కంపెనీకి చెందిన విమానాలను కొనుగోలు చేసిన భారత విమానయాన సంస్థ.. ఎయిర్‌ ఇండియా మనదేశంలో తాజాగా ఎయిర్‌ బస్‌ సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిసారి ఎయిర్‌బస్‌ A350–900 వాణిజ్య విమానాన్ని ఎయిర్‌ ఇండియా బెంగళూరు, ముంబై మహా నగరాల మధ్య ప్రారంభించింది. అలాగే ఈ విమానంలో సిబ్బందికి ప్రత్యేకమైన యూనిఫాంను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించింది.

AI 589 ఫ్లైట్‌ నంబర్‌ తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్‌బస్‌ A350–900 బయలుదేరింది. ఈ నేపథ్యంలో కొత్త విమానంలో సరికొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు సిద్ధమైన ప్రయాణికులను ముంబైకి చేర్చింది. మంగళవారం మినహా ప్రతి రోజు ఈ విమాన సర్వీస్‌ ఉంటుందని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. రోజూ ఉదయం 7.05 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఉదయం 8.50 గంటలకు ముంబైకి చేరుకుంటుందని తెలిపింది.

అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభించడానికి ముందు దేశీయ మార్గాల్లోనే ఎయిర్‌ బస్‌ సర్వీసులను నడపనున్నారు. సిబ్బంది అలవాటు పడటానికి, అదేవిధంగా రెగ్యులేటరీ అనుమతులు రావాల్సి ఉండటమే ఇందుకు కారణం. సిబ్బంది అలవాటు పడ్డాక, అనుమతులన్నీ లభించాక తదుపరి దశలో అంతర్జాతీయ సర్వీసుల్లో వీటిని నడుపుతారు.

దేశీయ మార్గాల్లో భాగంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల మధ్య సర్వీసులను నడపనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ బస్‌ లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ విమానంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం లభించనుంది.

కాగా మిగతా కంపెనీల విమానాలతో పోలిస్తే ఎయిర్‌ బస్‌ లో ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌ బస్‌ A350లో ఉన్న ఇన్‌–ఫ్లైట్‌ ఎంటరటైన్మెంట్‌ సిస్టమ్, ప్రత్యేకమైన సౌకర్యాలను హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ లో ప్రదర్శించి చూపారు.

ఎయిర్‌ బస్‌ A350లో త్రీ–క్లాస్‌ క్యాబిన్‌ లేఅవుట్‌ తో కాన్ఫిగర్‌ చేసిన 316 సీట్లు ఉన్నాయి. ఇందులో 28 ప్రైవేట్‌ బిజినెస్‌ సూట్లు కాగా, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు. మరో 264 విశాలమైన ఎకానమీ సీట్లు ఉన్నాయి.

కాగా అన్ని సీట్లు లేటెస్ట్‌ జనరేషన్‌ పానాసోనిక్‌ eX3 ఇన్‌–ఫ్లైట్‌ ఎంటరటైన్మెంట్‌ సిస్టమ్, హెచ్‌డీ స్క్రీన్‌ లతో అమర్చబడి ఉంటాయి. రోల్స్‌ రాయిస్‌ ట్రెంట్‌ ఎక్స్‌ డబ్ల్యూబీ ఇంజన్ల ద్వారా ఆధారితమైన ఈ విమాన ఇంధన సామర్థ్యం, ఇతర విమానాలతో పోల్చితే 20 శాతం మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇంధన ఉద్గారాలను తగ్గించడానికి దోహదం చేస్తుందని ఏవియేషన్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.