Begin typing your search above and press return to search.

ఈ ఎంపీ అభ్యర్థి మొత్తం అస్తి విలువ రూ.500 మాత్రమే!

ఈ సమయంలో అభ్యర్థుల ఎలక్షన్ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషించింది.

By:  Tupaki Desk   |   26 April 2024 1:51 PM GMT
ఈ ఎంపీ అభ్యర్థి మొత్తం అస్తి  విలువ రూ.500 మాత్రమే!
X

లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 88 స్థానాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... కేరళలో 20 లోక్‌ సభ స్థానాలు, కర్ణాటకలో 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తర ప్రదేశ్‌ లో 8, మధ్యప్రదేశ్‌ లో 6, అస్సాంలో 5, బీహార్‌ లో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి! ఇదే క్రమంలో... ఛత్తీస్‌ గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ లోని మూడు సీట్లు.. మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌ లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరిగింది.


ఈ సమయంలో అభ్యర్థుల ఎలక్షన్ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషించింది. ఈ క్రమంలో... కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణ గౌడ రెండో దశ పోలింగ్‌ లో అత్యంత ధనవంతుడని తేల్చింది. హెచ్‌.డీ. కుమారస్వామిపై పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఇదే సమయంలో... రూ.593 కోట్లతో కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్.. రెండో అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్నారు.

ఇదే క్రమంలో... మథుర లోక్‌ సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని ఆస్తులు రూ.278 కోట్లుగా ప్రకటించడంతో... మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. అనంతరం... మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ రూ.232 కోట్ల విలువైన ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదోస్థానంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డీ కుమారస్వామి రూ.217.21 కోట్లతో నిలిచారు.

ఇక అతి తక్కువ ఆస్తుల వివరాల విషయానికొస్తే... మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఇండిపెండేంట్ గా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ కేవలం రూ.500 విలువైన ఆస్తులు ప్రకటించారు. దీంతో... రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఇదే క్రమంలో... కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరో స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపారు.

అదేవిధంగా... అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ రూ.1,400 ఆస్తులతో మూడో స్థానంలో ఉండగా.. రాజస్థాన్‌ లోని జోధ్‌ పూర్ నుంచి పోటీ చేస్తున్న షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించి నాలుగో స్థానంలో ఉండగా.. కేరళలోని కొట్టాయం నుంచి పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.