'తల్లికి వందనం.. ఎలా ఉందమ్మా'
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందిన తల్లులకు ఐవీఆర్ ఎస్ ఫోన్కాల్స్ చేసి.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు.
By: Tupaki Desk | 25 Jun 2025 9:25 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ 6' పథకాల్లో కీలకమైంది.. ఆర్థికంగా ప్రభుత్వంపై భారం పడిన పథకం తల్లికి వందనం. దీనికిగాను ఏకంగా 8745 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెచ్చించారు. ఇంట్లో ఎంత మంది తల్లులు ఉంటే.. అంతమందికీ దీనిని వర్తింప చేశారు. చేస్తున్నారు. ఇంకా మిగిలిన వారి కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే.. చంద్రబాబుస్టయిల్ వేరేగా ఉంటుంది కదా! ఎక్కడ ఎప్పుడు ఏం చేసినా.. ఆయన కొలుచుకుంటారు.. కొలమానాలు వేసుకుంటారు. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటారు.
ఇప్పుడు 'తల్లికి వందనం' పథకంలోనూ అదే విధానం పాటిస్తున్నారు. ఈ నెల 25(బుధవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు తల్లికి వందనం పథకంపై మాతృమూర్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తల్లికి వందనం పథకం ఎలా ఉంది? దీని వల్ల మీ మీ కుటుంబాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? ఈ సొమ్ములు ఏం చేస్తున్నారు? విద్యా విషయమై ఖర్చు చేస్తున్నారా? లేక.. వేరేవి కొనుగోలు చేస్తున్నారా? తల్లికి వందన పథకం కింద మీకు జరుగుతున్న లబ్ధి ఏంటి? ఇలా.. మొత్తం 12 ప్రశ్నలను సంధించనున్నారు. వీటి ద్వారా మాతృమూర్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందిన తల్లులకు ఐవీఆర్ ఎస్ ఫోన్కాల్స్ చేసి.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. తద్వారా పథకంలో మార్పులు, చేర్పులు చేయడంతోపాటు.. సర్కారుకు లభించిన క్రెడిట్ను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు.. ఈ పథకం అమలు చేసిన నాటి నుంచి సర్కారుకు పెరిగిన గ్రాఫ్ను కూడా అంచనా వేసుకుంటారు. గత వైసీపీ ప్రభుత్వానికి.. తమకు ఉన్న తేడాను కూడా లెక్కలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. పాఠశాలల మెరుగుదలకు కూడా తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు.
మరోవైపు.. జూలై 1 నుంచి 15 వరకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందిన కుటుంబాల వారికి పోటీలు నిర్వహించనున్నా రు. వ్యాసరచన, డిబేట్లు, ఎలక్యూషన్, వక్తృత్వం, డ్రాయింగ్, పాటలు, కవితలు.. ఇలా అన్ని రకాలుగా తల్లికి వందనం పథకంపై పోటీలు నిర్వహించనున్నారు. దీనిలో తల్లిదండ్రులతోపాటు.. ఆయా ప్రభుత్వ స్కూళ్ల పేరెంట్స్ కమిటీలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. తద్వారా తల్లికి వందనం పథకంపై చర్చను మరో రెండు మాసాల పాటు పదిలంగా ప్రజల మధ్య ఉండేలా పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు.
