Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు టెక్కీ దుర్మరణం.. ప్రమాదం నుంచి బయటపడినా బలి!

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) దుర్మరణం పాలయ్యారు.

By:  Tupaki Desk   |   17 May 2024 7:15 AM GMT
అమెరికాలో తెలుగు టెక్కీ దుర్మరణం.. ప్రమాదం నుంచి బయటపడినా బలి!
X

అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వరుసగా భారతీయులు, ప్రధానంగా తెలుగువారు ఇటీవల కాలంలో ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ఉన్నత చదువులకోసమో.. ఉద్యోగాల కోసమో కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి అమెరికాకు వెళ్లిన వారు ఇలా అర్ధాంతరంగా చనిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పైగా ఇవన్నీ రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం.

అవును... అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల్లో ఇటీవల తెలుగు వారు వరుసగా మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్... అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలిసి ఇక్కడున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) దుర్మరణం పాలయ్యారు. పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా యూఎస్‌ లోని నార్త్‌ కరోలినాలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారు. నిరుడు శ్రీప్రియను వివాహం చేసుకున్నారు. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో ఒక్కసారిగా ఈ భారీ విషాదం నెలకొంది.

ఇందులో భాగంగా... భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తున్న సమయంలో వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. ఈ సమయంలో అది పల్టీలు కొట్టింది. ఈ సమయంలో తమ కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. అయినప్పటికీ మృత్యువు పృథ్వీరాజ్ ను వెంటాడింది.

ఈ సమయంలో తన భార్యను కారులోనే కూర్చోబెట్టి బయటికి వచ్చిన పృథ్వీరాజ్‌... ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్‌ చేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సమయంలో... శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.