Begin typing your search above and press return to search.

మూడు రెళ్ళు ఆరు : తెలంగాణాలో వెంటనే ఉప ఎన్నికల పర్వం !

మొత్తానికి ఉప ఎన్నికల పర్వానికి ఈ ముగ్గురు నేతలు తెర తీస్తున్నారు. దాంతో తెలంగాణాలో మూడు రెళ్ళు ఆరు అన్న చర్చ అయితే సాగుతోంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:45 AM GMT
మూడు రెళ్ళు ఆరు : తెలంగాణాలో వెంటనే ఉప ఎన్నికల పర్వం  !
X

అసలు ఎన్నికలకే లేదు కొసరు ఎన్నికల సంగతేంటి అని కంగారు పడాల్సినది లేదు. తెలంగాణాలో ఎన్నికల తరువాత ఉప ఎన్నికలు రెడీగానే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పాలి. తెలంగాణాలో అసలు ఎన్నికాలకు ఈ నెల 30న షెడ్యూల్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముహూర్తం పెట్టేసింది. మరి ఉప ఎన్నికల గొడవ ఏంటి అంటే అక్కడే ఉంది లెక్క అంతా అని అంటున్నారు.

ముందుగా తెలంగాణాలో ఉప ఎన్నికల పర్వానికి తెర తీసిన నేతగా బీయారెస్ అధినేతగా ముఖ్యమంత్రిగా కేసీయార్ ని చెప్పుకోవాలి. ఆయన గజ్వేల్ లో రెండు సార్లు గెలిచారు. ఈసారి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తే సరిపోతుంది. కానీ ఆయన ఉన్నట్లుండి కామారెడ్డి మీద కన్నేశారు. అది ఆయన పుట్టిన జిల్లాలోని సీటు. తన సొంత ప్రాంతం అన్న మాట.

ఇంతకాలం కేసీయార్ ఆ వైపుగానైనా చూడలేదు. ఇపుడు ఎందుకు ఇలా అంటే లెక్కలు ఏవో ఉన్నాయని అంటున్నారు. రెండు చోట్లా ఈసారి గెలిస్తే కామారెడ్డిని ఉంచుకుని గజ్వేల్ ని కుమార్తె కవిత కోసం ఇవ్వడానికే కేసీయార్ ఈ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక ఉమ్మడి నిజమాబాద్ లో పార్టీ పరిస్థితిని మెరుగు దిద్దడానికి కూడా ఈ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు

అలా రెండు చోట్ల పోటీ చేస్తూ కేసీయార్ ఉప ఎన్నిక ఒకటి ఉంటుంది అని చెప్పేశారు అని భావించారు. సరే కేసీయార్ ఒక్క చోట గెలిచి రెండవ చోట ఓడితే ఏమో అనుకోవచ్చు కానీ కేసీయార్ ప్రత్యర్ధులు కూడా రెండు చోట్ల నుంచి పోటీలో ఉన్నారు. వారే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్.

ఈ ఇద్దరూ కూడా తమ సొంత సీట్లతో పాటు కేసీయార్ సీట్లలోనూ తలపడుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి ముందుగా చెప్పుకోవాలంటే ఆయన కొండంగల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్నారు. మరి కేసీయార్ ని ఓడిస్తాను అని రెండు చోట్ల పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి రెండు చోట్లా గెలిస్తే ఏదో ఒక సీటు వదులుకోవాల్సి వస్తుంది. అలా ఆయన దేనిని ఉంచుకుంటారు అన్నది చర్చ. రేవంత్ రెడ్డి కొండంగల్ ని ఉంచుకుని కామారెడ్డిని సీనియర్ కాంగ్రెస్ నేతకు వదిలేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన గెలుపు కూడా ఉప ఎన్నికకు దారి తీస్తుంది అని అంటున్నారు.

ఇక ఈటెల రాజేంద్రని తీసుకుంటే ఆయన బీజేపీలో ప్రాముఖ్యత ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఆయన ఎనిమిది సార్లు గెలిచిన హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా రెండు చోట్లా గెలిస్తే ఏ సీటు వదులుకుంటారు అన్నది చచకు తెర లేస్తోంది.

అయితే ఈటెల వ్యూహం ప్రకారమే గజ్వేల్ లో పోటీకి దిగారని అంటున్నారు. గజ్వేల్ లో కూడా గెలిస్తే ఆయన దానినే ఉంచుకుని హుజూరాబాద్ ని వదిలేస్తారు. అక్కడ ఆయన తన సతీమణి జమునను ఉప ఎన్నికల్లో పోటీకి దించుతారు అని అంటున్నారు. మొత్తానికి ఉప ఎన్నికల పర్వానికి ఈ ముగ్గురు నేతలు తెర తీస్తున్నారు. దాంతో తెలంగాణాలో మూడు రెళ్ళు ఆరు అన్న చర్చ అయితే సాగుతోంది.