Begin typing your search above and press return to search.

హైకోర్టు తీర్పు.. రేవంత్‌ ప్రభుత్వం కింకర్తవ్యం ఏమిటి?

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది

By:  Tupaki Desk   |   7 March 2024 7:02 AM GMT
హైకోర్టు తీర్పు.. రేవంత్‌ ప్రభుత్వం కింకర్తవ్యం ఏమిటి?
X

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రొఫెసర్, కోదండరాం, సియాసత్‌ పత్రిక ఎడిటర్‌ అమీర్‌ అలీఖాన్‌ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దాన్ని కొట్టేసిన హైకోర్టు మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆదేశించింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్‌ పున:పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయలను ఎంపిక చేసింది. అయితే గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ వీరిద్దరి నియామకానికి ఆమోద ముద్ర వేయలేదు. దాసోజు, శ్రవణ్, కూర సత్యనారాయణ ఇద్దరూ రాజకీయ నేతలేనని, గవర్నర్‌ కోటాలో రాజకీయ నేతలను ఎమ్మెల్సీలుగా నియమించకూడదనే నిబంధనలు ఉన్నాయని అప్పట్లో తమిళి సై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్‌ 19న వీరి నియామకాన్ని తిరస్కరించారు.

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయ్యాక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్‌ కోదండరామ్, సియాసత్‌ పత్రిక ఎడిటర్‌ అమీర్‌ అలీ ఖాన్‌ లను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. దీనికి గవర్నర్‌ తమిళి సై కూడా ఆమోదముద్ర వేశారు.

అయితే గత ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వానికి తమను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే హక్కు ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారన్నారు. దీంతో తాము తుది ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయొద్దని కోదండరాంను, అమీర్‌ అలీ ఖాన్‌ ను హైకోర్టు జనవరి 30న ఆదేశించింది.

ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌ పై హైకోర్ట్‌ తీర్పు ఇచ్చింది. తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నోటిఫికేషన్‌ ను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ గవర్నర్‌ నూతన నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌ వచ్చాక మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్‌ కు అభ్యర్థుల పేర్లను పంపాలని సూచించింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్‌ తమిళి సై మళ్లీ తాజాగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అభ్యర్థులను సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఇద్దరు అభ్యర్థులకు గవర్నర్‌ ఆమోద్ర ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి కోదండరాం, అమీర్‌ అలీ ఖాన్‌ లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయనుందని సమాచారం.