Begin typing your search above and press return to search.

కేసీఆర్ నెక్స్ట్ అయిదేళ్ళూ అసెంబ్లీకి రారా...!?

కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ గా రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణా రాజకీయాలను శాసించారు. పదేళ్ళ పాటు తనదైన శైలిలో పాలించారు

By:  Tupaki Desk   |   15 Feb 2024 1:30 PM GMT
కేసీఆర్ నెక్స్ట్ అయిదేళ్ళూ అసెంబ్లీకి రారా...!?
X

కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ గా రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణా రాజకీయాలను శాసించారు. పదేళ్ళ పాటు తనదైన శైలిలో పాలించారు. ఆయనతోనే అసెంబ్లీ అన్నట్లుగా సాగింది. ఏకపక్షంగా పదేళ్ల పాటు ఆయన అసెంబ్లీని నడిపారు. అనాడు శాసనసభ సమావేశాలు కేసీఆర్ తోనే అన్నట్లుగా ఉండేవి. ఆయనే ప్రతీ అంశం మీద సుదీర్ఘంగా ప్రసంగాలు చేసేవారు.

కేసీఆర్ స్పీచ్ లను అడ్డుకోవడానికి ప్రయత్నించే ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నారు. దాని మీద విపక్షాలు అనాడు విమర్శలు చేశాయి. బీఆర్ఎస్ కి మాత్రమే పరిమితం చేస్తూ అసెంబ్లీని నడుపుతున్నారని కూడా కామెంట్స్ చేసేది. ఇక 2014 ఎన్నికల తరువాత కొత్తల్లో టీడీపీ పక్షాన నేతగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఆయనను పూర్తిగా మాట్లాడనివ్వకుండా చేసేవారు.

ఇక తొలి టెర్మ్ లో జానారెడ్డి కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ పక్ష నేతగా ఉన్నా విపక్షం వాయిస్ వినిపించకుండా చేసారు. రెండవ టెర్మ్ మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ గా ఉన్నారు. ఆయన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలు అడిగినా బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు పోయేవారు అన్న విమర్శలు ఉన్నాయి. అలా సభ అంతా బీఆర్ఎస్ ఫ్రీ హ్యాండ్ తో సోలోగా నడిపించేసింది అన్న విమర్శలు ఉండగానే హ్యాట్రిక్ సీఎం గా ఇదే సభలో అడుగుపెడతామని కేసీఆర్ అనుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా ధీమా పడ్డారు.

అయితే జరిగింది మాత్రం పూర్తిగా వేరు. అనూహ్యంగా కాంగ్రెస్ గెలవడం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో బీఆర్ఎస్ కి అది బిగ్ షాక్ గా మారింది. అదే విధంగా కెసీఆర్ అయితే అసెంబ్లీ ముఖమే చూడడానికి ఇష్టపడటం లేదు అన్న ప్రచారం సాగుతోంది. డిసెంబర్ లో అసెంబ్లీ తొలిసారి సమావేశం అయినపుడు తుంటి ఎముక విరిగింది అని చెప్పి ఆసుపత్రిలో కేసీఅర్ చేరారు అది ఆరు వారాల రెస్ట్ అన్నారు.

అలా అపుడు గడచిపోయింది. ఇక ఫిబ్రవరి 1న కేసీఆర్ స్పీకర్ చాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కేసీఆర్ ఇక సభకు వస్తారు అని అంతా అనుకున్నారు. అదే విధంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ ఈ నెల 10న కేసీఆర్ వస్తారు అని మరో ప్రచారం సాగింది. కానీ అదీ జరగలేదు. ఈ బడ్జెట్ సెషన్ ముగుస్తోంది కానీ కేసీఆర్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడంలేదు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే అసలు కేసీఆర్ ఈ అయిదేళ్ళూ సభకు దూరంగా ఉంటారు అని కూడా ప్రచారం సాగుతోంది. దానికి కారణం సీఎం సీటులో రేవంత్ రెడ్డిని చూస్తూ సభలో ఉండలేకనే అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కేవలం టీడీపీ పక్ష నేతగా ఉన్నపుడు కేసీఆర్ తొలిసారి సీఎం అయి అసెంబ్లీలో పూర్తిగా కనిపించారు.

ఇపుడు అటు నుంచి ఇటు సీన్ మారింది. దాంతోనే సభలో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుగా కూర్చోవడం అపొజిషన్ లో ఉండడం అంటే ఇబ్బంది కరంగా ఉంటుందని భావించే కేసీఆర్ అలా చేస్తున్నారు అని అంటున్నారు. గతంలో కొంతమంది అలాగే చేశారు. అప్పటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి 1994లో కాంగ్రెస్ ఓడిపోగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన సభకు రానే లేదు.

ఆయన కంటే ముందు టీడీపీ అధినేత ఎన్టీయార్ 1989లో ఓడారు. అయితే ఆయన మొదట్లో సభకు వచ్చినా ఆ తరువాత మాత్రం అసలు రాకుండానే పూర్తి కాలం గడిపారు. తిరిగి సీఎం గానే సభలోకి అని ఒక శపధం చేసారు. అలాగే జరిగింది. ఇక విభజన ఏపీలో చూసుకుంటే జగన్ తొలి మూడేళ్ళూ సభకు వచ్చి ఆ తరువాత స్వీయ బహిష్కరణ చేశారు. ఇపుడు చంద్రబాబు అదే చేస్తున్నారు. అయితే వీరంతా పూర్తిగా అయిదేళ్ళూ సభకు దూరం కాలేదు.

కానీ కేసేఅర్ మాత్రం అసెంబ్లీ ముఖం చూడడానికే ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావులతోనే ఈ టెర్మ్ అసెంబ్లీలో విపక్షాన్ని నడిపించేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక కేసీఆర్ సభకు ఈ టెర్మ్ రాకపోవచ్చు అని వినిపిస్తోంది.

ఇక కాంగ్రెస్ సీఎంల మార్పు ఉంటే అపుడు రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఎవరైనా వస్తే కనుక కేసీఆర్ మనసు మార్చుకుంటారేమో చూడాలి. రేవంత్ రెడ్డికి ఈ అయిదేళ్లూ మార్చే సీన్ అయితే లేదు కాబట్టి కేసీఆర్ కూడా రాకపోవచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి.