Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు... తాజా సర్వే సంచలనం!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Aug 2023 5:14 AM GMT
తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు... తాజా సర్వే సంచలనం!
X

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. గెలుపు పైన అధికార బీఆరెస్స్ ధీమా వ్య్యక్తం చేస్తుండగా... కర్ణాటక ఫలితాల అనంతరం మరింత ఊపుమీదున్న కాంగ్రెస్ మరింత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి! ఈ సమయంలో తాజాగా ఒక సర్వే సంచలన ఫలితాలు వెల్లడించింది.

అవును... హ్యాట్రిక్ సాధించాలని, ఫలితంగా జాతీయరాజకీయాల్లో తనదైన ముద్రవేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకుంటే.. ఎలాగైనా అధికారంలోకి రావాలని, కర్ణాటక విక్టరీని రిపీట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం గా పెట్టుకుంది. ఇదే సమయంలో దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్ల నడుమ... తెలంగాణాలో సత్తా చాటాలనేది బీజేపీ ఆరాటంగా ఉంది.

ఈ సమయంలో.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందనే సర్వే రిపోర్ట్ ను టైమ్స్ నౌ వెల్లడించింది. ఇప్పుడు ఈ సర్వే ఫలితం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార బీఆరెస్స్ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు 3-4 సీట్లు, బీజేపీకి 2-3 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని సర్వేలో తేల్చింది.

ఇదే సమయంలో... అధికార బీఆరెస్స్ కు 38.4 శాతం మంది ప్రజల మద్దతు ఉందని.. ఎన్డీఏకు 24.3 శాతం, 'ఇండియా' కూటమికి 29.9 శాతం, ఇతరులకు 7.4 శాతం మేర ఓట్లు వస్తాయని వెల్లడించింది. అంటే రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీఆరెస్స్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ సర్వే తన ఫలితాలు వెల్లడించింది.

ఈ సర్వే ఫలితాల ప్రకారం అధికార బీఆరెస్స్ తొలి స్థానంలో నిలవగా.. ఇండియా కూటమి తరువాతి స్థానంలో ఉంది. అవును... తెలంగాణలో ఎన్డీఏ కంటే కాంగ్రెస్ మెరుగైన స్థానంలో కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఈ నెలలోనే అభ్యర్ధుల ఎంపికను ఫైనల్ చేసే దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయని తెలుస్తోంది! వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రచారానికి సమయం ఉండటంతోపాటు.. అసంతృప్తులను బుజ్జగించొచ్చని ప్లాన్స్ చేస్తున్నాయి!