ఫస్ట్ టైమ్.. తెలంగాణ కూడా 'పీపీపీ' బాట!
తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న మేరకు.. మూడు జోన్లుగా విభజించనున్న ప్రాంతాలైన క్యూర్-ప్యూర్-రేర్ ప్రాంతాల్లో పీపీపీ విధానాన్ని అనుసరించి పలు ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
By: Garuda Media | 10 Dec 2025 8:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్) బాటపట్టిన రాష్ట్రంగా ఏపీ ముందుంది. ఇటీవల వైద్య కాలేజీలు సహా.. రాష్ట్రస్థాయి రహదారులను కూడా పీపీపీ విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. భవిష్యత్తులోనూ మరిన్ని ప్రాజెక్టులను ఈ తరహాలోనే అభివృద్ధి చేయనున్నారు. అయితే.. ఇప్పుడు తెలంగాణలోకూడా పీపీపీ విధానాన్ని అనుసరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. పీపీపీ మోడల్ను అనుసరించడం ఇదే తొలిసారి. ముఖ్యంగా మూడు ప్రాంతాలు(జోన్)గా రాష్ట్రాన్ని విభజించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆయా ప్రాంతాల్లో అభివృధ్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ మోడల్ను అనుసరించేందుకు సిద్ధమైంది.
సర్కారు ఉద్దేశం ఇదీ..
తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న మేరకు.. మూడు జోన్లుగా విభజించనున్న ప్రాంతాలైన క్యూర్-ప్యూర్-రేర్ ప్రాంతాల్లో పీపీపీ విధానాన్ని అనుసరించి పలు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. ప్రైవేటు సంస్థలకు.. ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్టు ఆయన వివరించారు. అంతేకాదు.. 2047 నాటికి రాష్ట్రం 30 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందేందుకు కూడా పీపీపీ మోడల్ చోదక శక్తిగా మారుతుందన్నా రు. అభివృద్ది చెందుతున్న.. కొన్ని రాష్ట్రాల్లో(ఏపీ అని ఆయన ఉద్దేశం కావొచ్చు).. పీపీపీ మోడల్ను అనుసరిస్తున్నారని కూడా భట్టి చెప్పుకొచ్చారు.
ఏంటా ప్రాజెక్టులు..
+ క్యూర్-ప్యూర్-రేర్ జోన్లలో ఏర్పాటు చేయనున్న మెట్రోలు, సోలార్ పార్కులు, స్కిల్ హబ్లు వంటి రంగాల్లో పీపీపీ విధానానికి పెద్దపీట వేయనున్నారు.
+ మానవాభివృద్ధి, నెట్-జీరో లక్ష్యాలకు ప్రభుత్వ నిధులను కేటాయించేందుకు కూడీ పీపీపీ మోడల్ను తీసుకుంటారు.
+ తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పీపీపీ విధానాన్ని అనుసరిస్తారు.
+ రవాణా, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో కూడా పీపీపీని ప్రోత్సహిస్తారు.
కేసీఆర్ హయాంలో..
కేసీఆర్ హయాంలో పీపీపీ విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు కూడా మంచిది కాదన్నారు. అందుకే పలు ప్రాజెక్టులను ఆయన స్వయంగా ప్రభుత్వంలోనే చేపట్టారు. దీంతో గత పదేళ్లో ఎక్కడా పీపీపీ విధానంలో ఒక్క ప్రాజెక్టును కూడా తెలంగాణ ప్రభుత్వంప్రారంభించలేదు. కానీ, తొలిసారి తెలంగాణలో పీపీపీ విధానానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేయడం.. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పడం గమనార్హం. దీనిపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రాయాక్షన్ వస్తుందో చూడాలి.
