సీఎం రేవంత్ కార్యక్రమాలు రద్దు.. హుటాహుటిన ఢిల్లీకి.. రీజనేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం నాటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
By: Tupaki Desk | 7 May 2025 2:43 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం నాటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు.. మంత్రు లు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్లు కూడా ఢిల్లీ కి పయనమయ్యారు. అయితే.. విషయం ఏంటి? ఎందుకు ? అనేది స్పష్టత లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సీఎం సహా మంత్రులు హస్తినకు వెళ్లారని తెలుస్తోంది.
విషయం ఏంటి?
కీలకమైన రెండు విషయాలపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 1) మంత్రి వర్గ విస్తరణ. 2) డీసీసీల నియామకం. ఈ రెండు కూడా.. కొన్నాళ్లుగా పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి వర్గ విస్తరణ అయితే.. నాలుగు మాసాలుగా చర్చగానే ఉంది. అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తున్నారు. మొత్తం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎవరికి వారు చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంకేముంది.. అయిపోయిందన్న వాదన కూడా వినిపించింది.
కానీ, అనూహ్యంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక, తమను మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే.. తమను తీసుకోవాలని నాయకులు రోడ్డెక్కారు. హుజూరాబాద్ నుంచి కొడంగల్ వరకు.. చాలా మంది నాయకులు ఇదే వాదన వినిపించారు. కులాలు.. సామాజిక వర్గాల ఆధారంగా కూడా మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న వారు ఉన్నారు. అధిష్టానాన్ని మెప్పించి చోటు దక్కించుకునే ప్రయత్నాలు కూడా చేశారు. మొత్తంగా చూస్తే.. మంత్రి వర్గ విస్తరణ ఇప్పటి వరకు ఎటూ తేలలేదు. తాజాగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక, డీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా.. ఇటీవల కసరత్తు జరిగింది. పార్టీ ఇంచార్జి.. మీనాక్షి కూడా దీనిపై నాయకులతో చర్చించారు. ఈ క్రమంలోనే మొత్తం 33 జిల్లాలకు 120 మందికిపైగా నాయకుల పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరిని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.