రేవంత్ రెడ్డితో బీజేపీ ఢీ...ఆమెకు పార్టీ పగ్గాలు ?
తెలంగాణాలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. 2028 ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది దాంతో సామాజిక రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది.
By: Satya P | 23 May 2026 4:00 AM ISTతెలంగాణాలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. 2028 ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది దాంతో సామాజిక రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. రెడ్డి జనాభా అధికంగా ఉన్న తెలంగాణా రాజకీయంగా వారి ప్రభావాన్ని గమనించి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణతో పాటే తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడిని కూడా నియమించాలని చూస్తోంది. ప్రస్తుతం తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుని తప్పిస్తారని అంటున్నారు. దీంతో భారీ మార్పులకే బీజేపీ శ్రీకారం చుడుతోంది అని అంటున్నారు.
ఈసారి కేంద్రంలో ముగ్గురు :
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు బండి సంజయ్, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. మరొకరు కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉన్నారు. ఆయనే కిషన్ రెడ్డి. అయితే ఇందులో బండిని తప్పిస్తారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది. ఆయన ప్లేస్ లో కొత్తగా ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారు. నిజామాబాద్ కి చెందిన ధర్మపురి అరవింద్ కి కేంద్ర మంత్రిగా చాన్స్ దక్కుతుందని అంటున్నారు. బండి సామాజిక వర్గానికి చెందిన వారితోనే ఆ పోస్టుని భర్తీ చేయడం ద్వారా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని లెక్క వేస్తున్నారుట.
ఈటెలకు చోటు ఉందా :
ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఒకసారి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి మల్కాజ్ గిరీ నుంచి ఏకంగా ఎంపీగా గెలిచిన ఈటెలకు తెలంగాణా రాజకీయాల్లో పాతికేళ్ళకు పైగా అనుభవం ఉంది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అలాంటి ఆయనకు బీజేపీలో అయితే పెద్దగా పదవులు దక్కింది లేదు. రాష్ట్ర పగ్గాలు ఇస్తారనుకుంటే అదీ లేదు. దాంతో ఆయన వర్గం ఒకింత అసంతృప్తిగా ఉందని అంటున్నారు. దాంతో ఈటెలకు మంత్రి పదవి ఇస్తారు అని అంటున్నారు. త ద్వారా బీజేపీలోకి వచ్చిన వారికి పార్టీ సమాదరిస్తుంది అన్న సందేశాన్ని పంపిస్తారు అని అంటున్నారు.
కిషన్ రెడ్డి విషయంలో :
ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటున్నారు. ఆయన శాఖను మారుస్తారు అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో ఆయనకు మరో ముఖ్య శాఖను అప్పగిస్తారు అని అంటున్నారు ఇక కేంద్ర మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మహబూబ్ నగర్ ఎంపీ సీనియర్ నాయకురాలు అయిన డీకే అరుణకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఆమెని తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ గా తీసుకుంటారు అని అంటున్నారు. తద్వారా ఆమె దూకుడు రాజకీయంతో పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చు అన్నది కమలనాధుల ఆలోచనగా చెబుతున్నారు.
రేవంత్ సొంత ఇలాకా :
ఇక డీకే అరుణ చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఆమె ఢీ అంటే ఢీ అంటూ రేవంత్ రెడ్డితో ఇప్పటికే పోటీ పడుతున్నారు. ఆమెకు కనుక కీలకమైన తెలంగాణా బీజేపీ అధ్యక్ష పీఠం అప్పగిస్తే పార్టీ పరుగులు తీస్తుందని రేవంత్ రెడ్డి కి సరైన ప్రత్యర్థిని ఎంపిక చేసినట్లు అవుతుందని బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపునకు తిప్పుకున్నట్లు అవుతుందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణాలో బీజేపీ ప్రక్షాళనకు కేంద్ర పెద్దలు నిర్ణయించారు అని అంటున్నారు ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలను పిలిపించుకుని మరీ చర్చిస్తున్నారు అని అంటున్నారు.
