Begin typing your search above and press return to search.

పాల పాకెట్లు బాంబుల్లా పేలుతున్నాయి.. లోకేశ్ ట్వీట్ లో నిజమెంత?

అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాల పాకెట్లపై లోకేశ్ చేసిన ట్వీట్

By:  Tupaki Desk   |   1 Oct 2023 6:04 AM GMT
పాల పాకెట్లు బాంబుల్లా పేలుతున్నాయి.. లోకేశ్ ట్వీట్ లో నిజమెంత?
X

అందరి చూపు తన మీద పడేలా చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు అంతకంతకూ శ్రుతి మించుతున్నాయంటూ విరుచుకుపడుతోంది ఏపీ అధికారపక్షం. విషయం ఏదైనా సంచలనంగా మారేందుకు వీలుగా తన భాషను తీవ్రంగా మారుస్తున్న లోకేశ్ వైఖరిని తప్పు పడుతున్నారు. తప్పును తప్పులా ఎత్తి చూపితే బాగుంటుందని.. దానికి మసాలా చేర్చి మాట్లాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందుకు తగ్గట్లే ఉందంటున్నారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాల పాకెట్లపై లోకేశ్ చేసిన ట్వీట్ ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

‘‘పసిపిల్లలకు ఇచ్చే పాలనూ వదలవా సైకో జగన్.. రాష్ట్రంలో జె బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జనగ్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు.. బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీ చేస్తూ కాలకూట విషంగా మార్చారు’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతకూ లోకేశ్ చేసిన ట్వీట్ ఆరోపణను చూస్తే.. జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న టెట్రా పాలపాకెట్లపై ముఖ్యమంత్రి ఫోటోను ప్రముఖంగా ప్రింట్ చేసి ఉన్న పాల పాకెట్లను పంపిణీ చేస్తున్నారు.

ఈ పథకానికి వస్తున్న ఆదరణ నేపథ్యంలో.. దాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా తన వాదనను వినిపించారు లోకేశ్. ఫ్రిజ్ లో నుంచి తీసిన పాల పాకెట్ ఉబ్బి ఉండటం.. ఆ పాకెట్ ను కట్ చేసిన వేళలో.. ఒక్కసారిగా పాలు బయటకు రావటాన్ని ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక్కడ లోకేశ్ మిస్ అయిన పాయింట్ ఏమంటే.. పంపిణీ చేసిన సమయంలో పాల పాకెట్ ఉబ్బి ఉంటే.. దాన్ని వీడియోలో షేర్ చేస్తే.. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంగా తేలుతుంది.

అందుకు భిన్నంగా ఫ్రిజ్ లో నుంచి తీసిన పాల పాకెట్ ఉబ్బి ఉందంటే.. దాన్ని పంపిణీ చేసిన సమయంలో అదెలా ఉందన్న విషయాన్ని చెప్పకుండా..ఫ్రిజ్ లో ఉన్న పాకెట్ ను చూపించి ట్వీట్ చేయటం వల్ల అనవసరమైన ఆందోళన వ్యక్తమయ్యేలా చేయటమే తప్పించి.. మరెలాంటి ప్రయోజనం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. ఇలాంటి ట్వీట్లతో లాభం కంటే నష్టమే ఎక్కువంటున్నారు. నిత్యం లక్షలాది మందికి చేరే పాల పాకెట్ల నాణ్యత సరిగా లేకుంటే.. ఈపాటికి సోషల్ మీడియాలో ఆ అంశం హోరెత్తేది. అయినా.. ప్రభుత్వం ఏదైనా.. ఉచితంగా అందించే వాటి నాణ్యతో ఏ మాత్రం బాగా లేకుండా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రభుత్వం తీరును తప్పు పడుతూ తాట తీసే ప్రోగ్రాం భారీగా ఉండేది. అదేమీ లేని వేళ.. లోకేశ్ ట్వీట్ లోని పేర్కొన్న పాల పాకెట్ మాత్రం ఉబ్బి ఉండటం చూస్తే.. ఆయన చేసిన ఆరోపణల్లో తప్పుడు అంశాలే ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. సంచలనం కోసం వ్యాఖ్యలు చేయటం బాగానే ఉన్నా.. శ్రుతి మించి రాగాన పడ్డట్లుగా ఉండొద్దన్న మాటను లోకేశ్ మిస్ కాకూడదు.