Begin typing your search above and press return to search.

టీడీపీ తొలి జాబితా రెడీ.. ఆ 60 మంది వీరే!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 1:30 PM GMT
టీడీపీ తొలి జాబితా రెడీ.. ఆ 60 మంది వీరే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తుండటంతో 2014 ఫలితాలు రిపీట్‌ అవుతాయని ఆయన ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా చేరొచ్చని అంటున్నారు.

కాగా టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసిందని అంటున్నారు. ఈ విషయంలో ఇరు పార్టీలు అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ పోటీ చేసే స్థానాల జాబితాను చంద్రబాబు విడుదల చేస్తారని గట్టిగా టాక్‌ నడుస్తోంది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 స్థానాలకు టీడీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు.

ఇదే సమయంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సైతం టీడీపీ పోటీ చేయగా మిగిలిన స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ రోజునే ఇందుకు ముహూర్తంగా ఎంచుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా టీడీపీ మొదటి లిస్టులో 60 మంది అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో బెందాళం అశోక్, టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆమదాలవలసలో కూన రవికుమార్‌. పలాసలో గౌతు శిరీష, రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్, బొబ్బిలిలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బేబీ నాయనకు సీట్లు ఇస్తారని అంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో విజయనగరం నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జున, కురుపాంలో టి.జగదీశ్వరి, పార్వతీపురంలో బి. విజయచంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో విశాఖ తూర్పులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణబాబు పాయకరావుపేటలో టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ పోటీ చేయొచ్చని అంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య, జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురంలో మాజీ మంత్రి చినరాజప్ప, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, రాజమండ్రి సిటీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు, గోపాలపురంలో మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు, అమలాపురం నుంచి అయితాబత్తుల ఆనందరావు, మండపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పోటీ చేయొచ్చని సమాచారం.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, పాలకొల్లు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి నుంచి మంతెన రామరాజు, దెందులూరు నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బరిలో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు, విజయవాడ (సెంట్రల్‌) నుంచి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ తాతయ్య, మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర , గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్లు వినపడుతున్నాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి నారా లోకేష్‌ , పొన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ , వినుకొండ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గురజాల నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఇక ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామెచర్ల జనార్దన్, కొండెపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహా రెడ్డి పేర్లు టీడీపీ మొదటి విడత జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా కోవూరులో పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి, ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్‌ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పేర్లు వినపడుతున్నాయి.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌ రెడ్డి, నగిరిలో గాలి భానుప్రకాష్, పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్‌ రెడ్డి , పీలేరులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక కడప జిల్లా జమ్మలమడుగులో భూపేష్‌ రెడ్డి, మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్, పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్లు మొదటి జాబితాలో ఉన్నాయని సమాచారం.

అలాగే కర్నూలు జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, కర్నూలులో టీజీ భరత్‌ , ఎమ్మిగనూరులో బివి జయనాగేశ్వర రెడ్డి, రాప్తాడులో పరిటాల సునీత, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, తాడిపత్రిలో జేసీ అస్మిత్‌ రెడ్డి , కల్యాణదుర్గంలో ఉమా మహేశ్వర నాయుడు , హిందూపూర్‌ లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని చెబుతున్నారు.