తంబళ్లపల్లె తమ్ముళ్లు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు..?
2019 ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ యాదవ్ కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆయన ఓడిపోయారు.
By: Garuda Media | 28 April 2026 8:45 AM ISTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో టిడిపి తరఫున బలమైన వాయిస్ వినిపించే నాయకులు కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. చిత్తూరు జిల్లా అంటేనే టిడిపి అధినేత చంద్రబాబుకు సొంత జిల్లా కావడం, జిల్లా వ్యాప్తంగా కూడా బలమైన టీడీపీ శ్రేణులు, నాయకత్వం ఉండడం తెలిసిందే. అయితే తంబళ్లపల్లె నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ఈ పరిణామాలు మారిపోతున్నాయి. 2014 తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలో టిడిపి తరఫున ఇద్దరు నాయకులు మారారు.
2019 ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ యాదవ్ కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆయన ఓడిపోయారు. గత ఎన్నికల్లో అభ్యర్థులు మార్చారు జయ చంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు కానీ ఆయన కూడా పరాజయం పాలయ్యారు. అయితే జయ చంద్రారెడ్డి గత ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చారు అన్నది వాస్తవం. కేవలం 10వేల ఓట్ల తేడాతోనే పెద్దిరెడ్డిని నిలువరించగలిగారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ పుంజుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ద్వారా పుంజుకోవచ్చు.
అదేసమయంలో మరింత మంది లబ్ధిదారులకు మేలు జరిగే లాగా వ్యవహరించడం ద్వారా ఇక్కడ పార్టీ పుంజుకుని వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ దక్కించుకునేలాగా అడుగులు వేస్తే అది మేలు చేస్తుంది. కానీ, అంతర్గతంగా జరుగుతున్న అధిపత్య పోరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే ఆర్థిక వ్యవహారాలు వ్యాపార వ్యవహారాల కారణంగా తమ్ముళ్ళ మధ్య కలివిడిపోయింది, ఎవరికి వారు అన్నట్టుగా మారిపోయారు, నిజానికి కూటమి వచ్చిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఒక్క చిన్న అభివృద్ధి పని కూడా జరగలేదు,
ద్వారకా నాథ రెడ్డి అటు ప్రజలకు ఇటు పార్టీకి కూడా.. దూరంగా ఉంటున్నాడు, ఫలితంగా నియోజకవర్గంలో ఆశించిన మేరకు అభివృద్ధి పనులు జరగడం లేదు, దీనిని తమకు అవకాశం గా తీసుకుని ఎదగాల్సిన టీడీపీ నాయకులు ఎవరికి వారు అన్నట్టుగా ఉండిపోవడం విశేషం. ఫలితంగా తంబళ్లపల్లెలో టీడీపీ కార్యక్రమాలు కానీ... ఆ దూకుడు కానీ.. ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఒకవైపునియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నా.. ఇక్కడి నాయకులు కదలకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాయకులు ఇప్పటికైనా మారతారా లేదా అనేది చూడాలి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచేరంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం అబిప్రాయపడుతున్నారు.
