కిమిడి వారి మౌనం వెనక ?
పాతికేళ్ళ పడుచు ప్రాయంలో రాజకీయంగా కీలకంగా మారి నేరుగా అసెంబ్లీకి దారులు తెరచి మరీ యువ ఎమ్మెల్యేగా తన సత్తాను చాటిన వారు కళా వెంకటరావు.
By: Tupaki Desk | 10 May 2025 8:15 AM ISTఆయన అత్యంత సీనియర్ నాయకుడు. రాజకీయంగా చూస్తే నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన నేత. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయం స్టార్ట్ చేసిన కిమిడి కళా వెంకటరావు 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పాతికేళ్ళ పడుచు ప్రాయంలో రాజకీయంగా కీలకంగా మారి నేరుగా అసెంబ్లీకి దారులు తెరచి మరీ యువ ఎమ్మెల్యేగా తన సత్తాను చాటిన వారు కళా వెంకటరావు.
ఇక చూస్తే ఉత్తరాంధ్రాలో తొలి హోం మంతిగా 1988 ప్రాంతంలో బరువైన బాధ్యతలను మోసిన నైపుణ్యమూ ఆయనకే దక్కింది. తొంబై దశకంలో ఆయన రాజ్యసభకు నెగ్గి ఆరేళ్ళ పాటు పెద్దల సభలో వాణిని బలంగా వినిపించి సమర్ధంగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన దివంగత కింజరాపు ఎర్రన్నాయుడుతో పోటీగా ముందుకు సాగేవారు
అన్న ఎన్టీఆర్ జమానాలో కింజరాపు చంద్రబాబు క్యాంప్ లో ఉంటే కళా పెద్దల్లుడు దగ్గుబాటి వర్గంలో ప్రముఖంగా కనిపించేవారు. ఇలా సిక్కోలు రాజకీయాల్లో మంత్రిగా ఎంపీగా తనకంటూ ప్రత్యేకతను సాధించిన ఆయన 2009 సమయంలో ప్రజారాజ్యంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి టీడీపీలో చేరారు. ఇక 2014లో ఆయనను ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చంద్రబాబు చేశారు. ఆ మీదట చివరి రెండేళ్ళలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.
చూస్తే 2019 ఎన్నికల్లో కళా వైసీపీ ప్రభంజనంలో ఎచ్చెర్ల నుంచి ఓటమి చెందారు. అయితే గడచిన అయిదేళ్ళ కాలంలో ఎచ్చెర్లలో తన పట్టుని నిలబెట్టుకుని 2024 ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ సీటు పొత్తులో బీజేపీకి పోయింది. ఆయనను తెచ్చి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి అప్పటి మంత్రి బొత్స సత్యనారయణ మీద పోటీ చేయమన్నారు. గెలిస్తే మంత్రి పదవి కూడా అని హామీ ఇచ్చారని ప్రచారం సాగింది.
అయితే బొత్సను ఓడించి బంపర్ విక్టరీ కొట్టినా కళాకు మంత్రి పదవి దక్కలేదు. తొలిసారి గెలిచిన జూనియర్ అయిన కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ విజయనగరం జిల్లా రాజా వారు చక్రం తిప్పారని చెప్పుకున్నారు.
పోనీ అసెంబ్లీ స్పీకర్ గా తన పేరు పరిశీలిస్తారు అనుకుంటే అక్కడా ఏమీ కుదరలేదుజ్. ఆ తరువాత టీటీడీ చైర్మన్ పదవి అయినా దక్కుతుందని చూస్తే ఆ ఆశా లేకుండా పోయింది. ఘనమైన నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందని అనుకున్నారు. అది లేదని తేలిపోయింది ఇక సీనియర్లకు చెక్ అంటూ మరో వైపు ప్రచారం సాగుతోంది.
దీంతో కిమిడి వారు పూర్తి మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు. విషయం అర్ధమైన ఆయన ఈ టెర్మ్ జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సిందేనా అన్న ఆవేదనతో ఉన్నారని అంటున్నారు. ఇక కళా ఓడించిన బొత్సకు కాలం కలసి వచ్చి విశాఖ నుంచి స్థానిక కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆ మీదట శాసనమండలిలో విపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ తో హోదాను దక్కించుకున్నారు.
ఇలా చూస్తే కనుక కళా వెంకటరావు వర్గం కూడా ఏమి చేయాలో తోచక నైరాశ్యంలో ఉందని అంటున్నారు. పార్టీలో అత్యంత సీనియర్లుగా తాను అయ్యన్న మాత్రమే ఉన్నామని అసెంబ్లీ తొలి సమావేశాలలో చెప్పిన తరువాత మళ్ళీ కళా వాయిస్ అయితే వినిపించలేదు. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడిని రాజకీయంగా ముందుకు తీసుకుని రావాలని చూస్తున్న ఆయన కోరిక ఏ మేరకు నెరవేరుతుంది అన్నది కూడా తెలియడంలేదు అని అంటున్నారు.