కొత్త నేతలు.. కొత్త ప్రయోగాలు.. టీడీపీ లెక్క!
గత ఎన్నికల సమయంలో వైసీపీ మాత్రమే కాకుండా.. టీడీపీ కూడా కొత్త ప్రయోగాలు చేసింది.
By: Garuda Media | 9 July 2026 5:00 PM ISTగత ఎన్నికల సమయంలో వైసీపీ మాత్రమే కాకుండా.. టీడీపీ కూడా కొత్త ప్రయోగాలు చేసింది. సీమలోని నాలుగు పార్లమెంటు స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. వారంతా విజయం దక్కించుకున్నా రు. ఇక, కోస్తాలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో కొత్త నేతలను ప్రవేశ పెట్టి.. కొత్త ప్రయోగాలు చేసి.. గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాను అనుసరించేదిశగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సీనియర్లు చెబుతున్నారు.
గత ఎన్నికలను పరిశీలిస్తే.. అనంతపురం, హిందూపురం, చిత్తూరు, కర్నూలు వంటి పార్లమెంటుస్థానాల్లో కొత్త నాయకులకు చంద్రబాబు అవకాశం కల్పించారు. అప్పటి వరకు రాజకీయ వాసనే తెలియని దగ్గుమళ్ల ప్రసాదరావుకు చిత్తూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక, ఇతర నియోజకవర్గాలలోనూ ఇలాంటి ప్రయత్నాలే చేశారు. బాపట్లలో పొరుగు రాష్ట్రానికి చెందిన తెన్నేటి కృష్ణప్రసాద్కు అవకాశం ఇచ్చారు. వీరంతా విజయం దక్కించుకున్నారు.
ఇప్పుడు ఎందుకు?
ఇక, వచ్చే ఎన్నికల్లోనూ ఇలానే ప్రయోగాలు చేసేందుకు, కొత్త వారికి అవకాశం కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనికి కారణం.. ఇప్పుడున్న వారిపై తీవ్ర ఆరోపణలు రావడంతోపాటు.. వారికి అవకాశం ఇచ్చినా మార్పు కనిపించకపోవడమేనని తెలుస్తోంది. దీంతో కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని ఎక్కడా దాచుకోకుండానే చంద్రబాబు చెబుతున్నారు.
ఇప్పుడున్న వారిలో సగం మంది నేతలను మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు చంద్రబాబు సంకేతాలు ఇస్తు న్నారు. అయితే.. ఎవరు ఏంటనేది మాత్రమే రహస్యంగా ఉంచుతున్నారు. నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, సమస్యలపై స్పందించకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయకపోవడం, వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యం అభివృద్ధికి ఇవ్వకపోవడం వంటివి ప్రధానంగా నాయకులకు సమస్యగా మారింది. ఇలాంటి వారి జాబితా తెప్పించుకున్న చంద్రబాబు వారికి ఇప్పటికే అవకాశం ఇచ్చారు. ఇంకా మారకపోతే.. తానే మారుతానని హెచ్చరిస్తున్నారు.
