బాబు చెప్పారు.. దూకుడు పెంచారు!
ఏపీలోని చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న పలువురు మూకుమ్మడిగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 21 May 2025 5:47 PMఏపీలోని చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న పలువురు మూకుమ్మడిగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా తమతమ నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి మరీ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత సహా.. మరికొందరు బుధవారం ఎక్కడికక్కడ మీడియా మీటింగులు పెట్టి జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ను తక్షణమే జైలుకు పంపించాలని మంత్రులు వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా లిక్కర్ కుంభకోణాన్ని ప్రస్తావించిన మంత్రులు ఈ వ్యవహారంలో జగన్ పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు. దీంతో ఆయనను తక్షణమే అరెస్టు చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇక, వైసీపీ నాయకులపైనా మంత్రులు విమర్శల బాణాలు సంధించారు. క్షేత్రస్థాయిలో తమ బలం లేకపోవడంతో టీడీపీ కూటమి పై విమర్శలుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల చైర్మన్ల ఎన్నిక సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లను నిర్బంధిస్తున్నారని.. చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పోయినా.. వైసీపీ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదని అన్నారు.
ఇక, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు సహా.. బొండా ఉమా వంటి వారు కూడా బుధవారం ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మీడి యా ముందుకు వచ్చారు. జగన్పై విమర్శలు చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసి.. అవాకు లు చెవాకులు పేలుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా.. ఇంకా మార్పు రాలేదని అన్నారు. జగన్ వంటి వ్యక్తి.. రాజకీయాలకు పనికిరాడని..త క్షణమే ఆయనను జైలుకు పంపించాలని అన్నారు. అంతేకాదు.. జగన్ ఉంటే పెట్టుబడులు కూడా రాబోవని వ్యాఖ్యానించారు.
ఎప్పటికప్పుడు గుర్తు చేయాలా?
ఇదిలావుంటే.. టీడీపీమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు.. తమ బాధ్యతలను ఎప్పటికప్పుడు గుర్తు చేయాల్సి వస్తోందన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. గతంలోనూ చంద్రబాబు పదే పదే చెబితే తప్ప.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుకు రాలేదు. అదేవిధంగా సర్కారుపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకునేందుకు కూడా నాయకులు మీడియా ముందుకు రాలేదు. ఇక, ఇప్పుడు కూడా సేమ్ టుసేమ్ అన్నట్టుగా చంద్రబాబు తాజాగా మంత్రివర్గ సమావేశంలో క్లాస్ ఇచ్చి.. ప్రత్యర్థుల ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా మీడియా ముందుకు వెళ్లాలని చెబితే తప్ప నాయకులు కదలకపోవడం గమనార్హం.