మహానాడుకు తొలి విరాళం.. వర్మ సృష్టించిన రికార్డు..!
టీడీపీ అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడుకు సాధారణంగానే విరాళాలు స్వీకరించడం ఆనవాయితీ.
By: Tupaki Desk | 27 May 2025 8:06 AMటీడీపీ అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడుకు సాధారణంగానే విరాళాలు స్వీకరించడం ఆనవాయితీ. ఇది అన్నగారి హయాం నుంచి కూడా కొనసాగుతోంది. చాలా మంది అప్పట్లో పార్టీకి భూములు కూడా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ భూములు ఎక్కువ అయిపోవడంతో చంద్రబాబు వచ్చాక.. కేవలం విరాళాలు, బంగారం మాత్రమే స్వీకరించే విధానాన్ని అమలు చేశారు. అప్పటి నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే.. మహానాడు చివరి రోజు విరాళాలు స్వీకరించే ప్రక్రియను అధికారికంగానే చేపడతారు. ఇలా విరాళాలు తీసుకున్న మొత్తానికి రసీదులు ఇస్తారు. వీటిని పన్ను మినహాయింపు కింద(80సీ) కూడా చూపించుకునే వెసులుబాటు ఉంది. అయితే.. ఈ ఏడాది మహానాడు ప్రారంభానికి ముందే.. గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ రికార్డు సృష్టించారు. మహానాడుకు ఆయనే తొలి విరాళం అందించారు.
10 లక్షల రూపాయల చెక్కును ఆయన మంత్రి అనగాని సత్యప్రసాద్కు అందించారు. పార్టీకి ఇతోధికంగా సాయం చేయడం తన వంతు కర్తవ్యంగా వర్మ పేర్కొన్నారు. ఇక, నియోజకవర్గం నుంచి 2 వేల మంది కార్యకర్తలను ఆయన మహానాడుకు తరలించారు. వారి ఖర్చులను కూడా ఆయనే భరిస్తున్నారు. అలాగే మండలస్థాయిలోని కార్యాలయాల్లో ప్రత్యేక తెరలను ఏర్పాటు చేసి.. మహానాడును లైవ్లో చూసేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, ఇదే మహానాడుకు రెండో విరాళంగా కూడా 10 లక్షల రూపాయలు అందాయి. టీడీపీ నాయకుడు, ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్.. డేగల ప్రభాకర్.. ఈ మొత్తాన్ని అందించినట్టు ప్రకటించారు. అయితే.. తొలి విరాళం మాత్రం వర్మదే కావడం గమనార్హం. వాస్తవానికి మహానాడుకు విరాళాలిచ్చేందుకు.. చివరి రోజును నిర్ణయించినా.. వర్మ ముందుగానే ఇవ్వడం ద్వారా పార్టీపై తన అభిమానాన్ని చాటుకున్నారని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు.