Begin typing your search above and press return to search.

ఎంపీల రాజ్యంలో సీనియర్ల అసహనం ?

విశాఖ అనకాపల్లి రెండు జిల్లాలలో టీడీపీ సీనియర్లు కీలక నేతలు అసహనంతో ఉన్నారా అంటే జరుగుతున్న ప్రచారం మాత్రం అలాగే ఉంది అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2025 3:00 AM
ఎంపీల రాజ్యంలో సీనియర్ల అసహనం ?
X

విశాఖ అనకాపల్లి రెండు జిల్లాలలో టీడీపీ సీనియర్లు కీలక నేతలు అసహనంతో ఉన్నారా అంటే జరుగుతున్న ప్రచారం మాత్రం అలాగే ఉంది అంటున్నారు. ఈ మధ్యనే మాజీ మంత్రి భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి విమాన సేవలు సరిగ్గా లేవని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన సొంత పార్టీ కేంద్ర మంత్రిగా సంబంధిత శాఖకు ఉన్నా తన మనసులో మాటను ఆ విధంగా బాహాటంగా చెప్పేశారు.

అయితే దాని మీద హైకమాండ్ సీరియస్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే గంటాలో అసహనం ఆ విధంగా మాట్లాడించింది అని అన్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే కనుక ఇంకో సీనియర్ నేత మాజీ మంత్రి కూడా సొంత ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఎవరో కాదు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఈ నెల 30న విశాఖలో శ్రీ సింహాచలంలో నిర్వహించే చందనోత్సవం గురించి చేపట్టాల్సిన ఏర్పాట్ల మీద తాజాగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అనకాపల్లి జిల్లా నుంచి ఏ ఒక్క కూటమి ఎమ్మెల్యేని పిలవలేదు అని బండారు గుస్సా అయ్యారు.

అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన సొంత ప్రభుత్వం మీదనే ఫైర్ అయ్యారు. ప్రతీ ఏటా అందరినీ పిలిచి చర్చించే సంప్రదాయాన్ని ఎందుకు ఈసారి మార్చారని కూడా ఆయన నిలదీశారు. ఇంకో వైపు పెందుర్తి లో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా ఎమ్మెల్యేలు అంటే నామమాత్రమే అయ్యారని వాపోతున్నారని అంటున్నారు తాము ఏ పని చెప్పినా జరగడం లేదు అని అంటున్నారు.

ఇలా పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు కీలక నాయకులు అసహనంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నారని అంటున్నారు. దీనికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో అయితే సీనియర్ల హవా సాగేది. కానీ ఇపుడు సీన్ మారింది అని అంటున్నారు. విశాఖ జిల్లా టీడీపీ వ్యవహారాలను ఎంపీ శ్రీ భరత్ దగ్గరుండి చూసుకుంటున్నారు అని అంటున్నారు. అంతా ఆయన కనుసన్నలలో జరుగుతోంది అని అంటున్నారు.

అంతే కాదు ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గం లో ఎంపీ అనుచరులు ఉన్నారని వారి మాట చలామణీ అవుతోంది అని అంటున్నారు. ఇక అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే బీజేపీకి చెందిన సీఎం రమేష్ హవా సాగుతోంది అని అంటున్నారు. ఆయన సైతం తన పార్లమెంట్ పరిధిలో జరిగే ప్రతీ విషయం మీద ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీద ఆయన పట్టు ఉందని చెబుతున్నారు.

ఇలా ఎంపీలు ఇద్దరూ జిల్లాలను చూసుకుంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా వ్యవహారాలను నడిపేస్తున్నారు అని సీనియర్లు గుస్సా అవుతున్నారుట. ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాలలో పనులు ఏముంటాయని అంటున్న వారూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉండాలని కోరుకునే వారు అంతా ఈ పరిణామాలతో కొంత ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు

చిత్రమంటి అంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరి టీడీపీ అధినాయకత్వం కుటుంబ సభ్యుడు. రెండవ వారు అయితే అత్యంత సన్నిహితుడు. అందువల్ల బయటకు ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉందని గుసగుసలు పోతున్నారుట. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో తెలియదు కానీ ఫ్యూచర్ లో మరికొందరు నాయకులు సీనియర్లు కూడా నోరు తెరుస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయం ఏమిటో.