Begin typing your search above and press return to search.

టీడీపీలో వారసులు ...అదొక్కటే చాలదా ?

తాజాగా పార్టీ కమిటీలలో ప్రకటించిన పేర్లు పదవులకు ఎంపిక చేసిన వారి జాబితా చూస్తే కొద్ది మంది వారసులు మాత్రమే పదవులు దక్కించుకున్నారు.

By:  Satya P   |   17 May 2026 9:20 AM IST
టీడీపీలో వారసులు ...అదొక్కటే చాలదా ?
X

తెలుగుదేశం పార్టీ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. అధినాయకత్వం అయితే 2024లో పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఏ మాత్రం రిలాక్స్ కాకుండా 2029 ఎన్నికల మీదనే ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగానే పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవులు కేటాయిస్తూ పనిమంతులకు చోటు కల్పిస్తూ ముందుకు సాగుతోంది. 2029 లో కొత్త నేతలను చూస్తారు అన్న సందేశాన్ని అయితే పార్టీ హైకమాండ్ ఇప్పటికే పంపించేసింది. సీనియర్లకు కూడా దీని మీద ఒక అవగాహన వచ్చేసింది. దాంతో తమ వారసులను తయారు చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇటీవల టీడీపీ జాతీయ ఏపీ కమిటీలను ప్రకటించింది. అందులో ఎంపిక చేసిన అనేక మంది యువ నేతలు కొత్త వారూ కావడం విశేషం. ఈ జాబితాలో వారసులు అతి తక్కువ మంది మాత్రమే ఉండడం గమనార్హం.

అతి పెద్ద లిస్ట్ గానే :

ఉత్తరాంధ్ర జిల్లాలలో చూసుకుంటే టీడీపీలో వారసుల జాబితా అతి పెద్దగానే ఉంది. ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున సీనియర్ నేతల కుమారులూ కుమార్తెలు రాజకీయ వారసత్వాన్ని కోరుకుంటున్నారు. విశాఖ తూర్పు నుంచి సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కుమారుడు 2029 లో పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన ఇటీవల పుట్టిన రోజుని ఘనంగా జరుపుకున్నారు. ఆయనకు అభిమానులు యంగ్ టైగర్ అని ఒక బిరుదు ఇచ్చి మరీ ఫ్లెక్సీలు కట్టారు. ఈసారి తూర్పునకు ఆయనే కొత్త మార్పు అని వెలగపూడి వర్గం ప్రకటించుకుంటోంది. అలాగే పశ్చిమ నుంచి ఎమ్మెల్యే గణబాబు కుమారుడు మౌర్య సింహ కూడా 2029 లో పోటీకి సిద్ధపడుతున్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు అక్కడ నుంచే 2029 లో రెడీ అని అంటున్నారు. అనకాపల్లి నుంచి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్, నర్శీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా ఎన్నికల్లో పోటీకి 2029 నే ఎంచుకుంటున్నారు. భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ సైతం పోటీకి తయారు అని అంటున్నారు.

వీరంతా అదే రూట్ :

ఇక విజయనగరం నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కుమారుడు రాం మల్లిక్ కి ఎచ్చెర్ల సీటుని కోరుతున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి చూస్తే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె పోటీకి సిద్ధం అని చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి దివంగత నేత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వారసులు కూడా పోటీకి సిద్ధపడతారు అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగానూ పార్టీ తరఫున పనిచేస్తున్న వారసులు ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చూస్తే మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కూడా 2029 లో అరకు టికెట్ ని ఆశిస్తున్నారు.

అదే కొలమానం కాదు :

అయితే టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు అయితే స్పష్టంగానే ఉన్నాయని అంటున్నారు. తాజాగా పార్టీ కమిటీలలో ప్రకటించిన పేర్లు పదవులకు ఎంపిక చేసిన వారి జాబితా చూస్తే కొద్ది మంది వారసులు మాత్రమే పదవులు దక్కించుకున్నారు. అందులో అయ్యన్న కుమారుడు విజయ్, అలాగే కిడారి శ్రావణ్ కుమార్, కిమిడి రాం మల్లిక్, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ, బగ్గు రమణమూర్తి కుమార్తె ఇలా వీరికే పదవులు లభించాయి. మిగిలిన వారికి మాత్రం ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. దాంతో వారంతా కలవరపడుతున్నారు.

బాబు మార్క్ క్లాస్ :

ఇక ఇటీవల విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో బాబు ఉండవల్లిలో భేటీ అయిన సందర్భంగా క్లాస్ తీసుకున్నారు అని అంటున్నారు. ఎవరైనా సరే సమర్థంగా పనిచేయకపోతే మార్పులు తప్పదని బాబు హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతే కాదు వారసుల విషయంలోనూ ప్రస్తావన వచ్చిందని ఎవరికి వారుగా ఈ విషయంలో చెప్పుకుంటూ పోతే కుదరదని అధినాయక్తవం అన్నట్లుగా భోగట్టా. అంటే తమ తరువాత వారసులు తమ కుమారుడే అని ఎవరైనా భావిస్తే కనుక అది అయ్యేది కాదని తేల్చి చెప్పినట్లు అయిందని అంటున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే పార్టీ పదవులలో మొండి చేయి చూపించారు కాబట్టి వారసులు అంతా టికెట్ రేసులోకి వచ్చినట్లు కాదన్న సందేశాన్ని కూడా బలంగా ఇచ్చారని అంటున్నారు. సో ఎవరేంటి అన్నది వారి పనితీరుతోనే రుజువు చేసుకోవాలన్నదే పార్టీ పెద్దల మాటగా ఉంది. కేరాఫ్ అంటూ రంగంలోకి దిగిపోవాలనుకుంటే నో చాన్స్ అనే అంటున్నారు.