సుప్రీంకోర్టూ.. పొదుపు మంత్రం.. ఇలా చేస్తారట!
తాజాగా ఈ పొదుపు జాబితాలో సుప్రీంకోర్టు కూడా చేరింది. ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి ఒకరు తన ఇంటి నుంచి సైకిల్పై హైకోర్టుకు చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
By: Garuda Media | 16 May 2026 12:08 AM ISTప్రధాని నరేంద్ర మోడీ పొదుపు మంత్రం పఠించడం ప్రారంభించాక.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పొదుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ తమ కాన్వాయ్లను తగ్గించుకుంటున్నారు. తాజాగా ఈ పొదుపు జాబితాలో సుప్రీంకోర్టు కూడా చేరింది. ఇటీవల అలహాబాద్ న్యాయమూర్తి ఒకరు తన ఇంటి నుంచి సైకిల్పై హైకోర్టుకు చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీటిని ఉటంకిస్తూ.. తాజాగా సుప్రీంకోర్టు కూడా పొదుపు చర్యలు తీసుకుంటున్నట్టు రిజిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవీ మార్పులు..
+ ప్రతి సోమవారం, శుక్రవారం పూర్తిస్థాయిలో వర్చువల్గానే కేసుల విచారణ జరగనుంది. అంటే.. ఆయా రోజుల్లో న్యాయమూ ర్తులు తమ తమ ఇళ్ల నుంచే విచారణలు చేపడతారు. తద్వారా కోర్టుకు ఎవరూ రావాల్సిన అవసరం ఉండదు.
+ మంగళవారం నుంచి గురువారం వరకు హైబ్రిడ్ విధానంలో విచారణలు చేపట్టనున్నారు. అంటే.. కీలక కేసులను మాత్రమే విచారణకు తీసుకుంటారు. తద్వారా కోర్టుకు వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది.
+ కోర్టుకు వచ్చే న్యాయమూర్తులు.. ఇతర సిబ్బందిని కార్ పూలింగ్ విధానాన్ని అనుసరించేలా చేస్తారు. అంటే.. ఒక న్యాయమూర్తి కారులో ఐదుగురు న్యాయమూర్తులు ప్రయాణించనున్నారు. న్యాయవాదులు కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా చూడాలని రిజిస్ట్రీ సూచించారు.
+ సుప్రీంకోర్టు సిబ్బందికి సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోంను ప్రోత్సహిస్తారు. తద్వారా..కోర్టుకు రాకుండానే ఇంటి నుంచి పనులు చేసుకునే వెసులుబాటు కలుగనుంది. కక్షిదారులకు కూడా ఇంటి నుంచివర్చువల్గా పాల్గొనే అవకాశం కల్పిస్తారు. తద్వారా ఇంధన భద్రతతోపాటు పొదుపునకు కూడా అవకాశం ఉంటుంది.
+ సుప్రీంకోర్టు రోజువారి కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా.. 50 శాతం సిబ్బందికి వర్చువల్ వర్క్ అప్పగించే విషయంపై పరిశీలన చేస్తారు. వారిని వారాల చొప్పున షిఫ్టుగా కేటాయించనున్నారు. ఇది కూడామెరుగైన ఫలితం ఇస్తుందని అంటున్నారు.
విజయవాడ నుంచి మంత్రి...
ఏపీలో ఇంధన పొదుపుకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కారులో మంత్రి నిమ్మల రామానాయుడు.. విజయవాడ నుంచి అమరావతిలోని సచివాలయానికి సైకిల్పై వెళ్లారు. సుమారు 30 కిలో మీటర్ల దూరాన్ని ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం గమనార్హం. బెంజిసర్కిల్ నుంచి.. కనుకదుర్గ ఫ్టైవోవర్ మీదుగా తాడేపల్లి నుంచి ఆయన సచివాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
