సుప్రీంకోర్టులో సీజేఐపై దాడి చేసిన వ్యక్తిపై ధిక్కార చర్యలకు నిరాకరణ, న్యాయవ్యవస్థ పరిపక్వత
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు, న్యాయవాదుల సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
By: A.N.Kumar | 28 Oct 2025 4:00 AM ISTభారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) చరిత్రలో ఇటీవల చోటుచేసుకున్న ఓ సంచలన ఘటన, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై న్యాయవాది రాకేశ్ కిశోర్ దాడికి యత్నించిన సంఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు చూపిన పరిపక్వత న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసింది.
ఘటన పూర్వాపరాలు
ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. న్యాయవాది రాకేశ్ కిశోర్ ఆకస్మాత్తుగా లేచి, ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై తన బూటుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతడు “సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించం” అంటూ నినాదాలు చేసినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ గవాయ్ ప్రశాంతంగా స్పందిస్తూ “ఇలాంటి బెదిరింపులు న్యాయవ్యవస్థను, నన్ను ప్రభావితం చేయలేవు” అని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) చర్యలు
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు, న్యాయవాదుల సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) తక్షణమే స్పందించి రాకేశ్ కిశోర్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అదేవిధంగా అతనికి సుప్రీంకోర్టు ప్రాంగణ ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఎంట్రీ కార్డును కూడా రద్దు చేసింది.
* ధిక్కార చర్యలకు నిరాకరణ – కీలక వ్యాఖ్యలు
SCBA దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దాడికి యత్నించిన న్యాయవాది రాకేశ్ కిశోర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. సీజేఐ స్వయంగా ఫిర్యాదు చేయలేదని, ధిక్కార చర్యలు ప్రారంభించేందుకు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారని ధర్మాసనం స్పష్టం చేసింది. “ధిక్కార చర్యలు ప్రారంభిస్తే, ఆ వ్యక్తికి అనవసర ప్రాధాన్యం లభిస్తుంది. ఇలాంటి వ్యక్తులను పెద్దగా ప్రచారం చేయడం సరికాదు” అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు కేసు తీవ్రతను తగ్గించడంలో వ్యక్తిగత ప్రచారం నిరోధించడంలో న్యాయవ్యవస్థ వైఖరిని స్పష్టం చేశాయి.
* భవిష్యత్తు చర్యలపై పరిశీలన
కోర్టు ప్రాంగణంలో నినాదాలు చేయడం, బూట్లు విసరడం వంటి చర్యలు కోర్టు ధిక్కార పరిధిలోకి వస్తాయని ధర్మాసనం పేర్కొంది. అయితే, వాటిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తి నిర్ణయం అని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధక చర్యలు చేపట్టే దిశగా పరిశీలన జరపనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
రాకేశ్ కిశోర్పై ధిక్కార చర్యలకు అనుమతి నిరాకరించడం ద్వారా, న్యాయస్థానం శాంతంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలనే ఉన్నత ప్రమాణాలను సుప్రీంకోర్టు నిలబెట్టిందని న్యాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా అత్యున్నత న్యాయస్థానం తన పరిపక్వతను, సంయమనాన్ని ప్రదర్శించింది.
