Begin typing your search above and press return to search.

2027 వరకు గడ్డు కాలమే.. ఆందోళనలో శాస్త్రవేత్తలు..

ఎల్ నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వింతైన మార్పులకు దారితీస్తుంది. ఒకవైపు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలు తీవ్రమైన కరవుతో, అడవి మంటలతో పోరాడుతుంటే..

By:  Tupaki Political Desk   |   8 April 2026 9:28 AM IST
2027 వరకు గడ్డు కాలమే.. ఆందోళనలో శాస్త్రవేత్తలు..
X

పసిఫిక్ సముద్రం వేడెక్కుతుండడం వల్ల రాబోయే కాలం వాతావరణ పరంగా పెను సవాళ్లు విసరబోతోంది. సైంటిస్టులు హెచ్చరిస్తున్న ఈ ‘సూపర్ ఎల్ నినో’ పరిణామాలు కేవలం ఎండలకే పరిమితం కాకుండా, మొత్తం భూమిపై ఉన్న జీవనశైలిని మార్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2026 ప్రారంభం నుంచి వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి, ఇవి 2027 నాటికి పతాక స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

2027 వరకు గడ్డుకాలమే!

చుట్టూ మండుతున్న ఎండలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, చేనులో ఎండిపోతున్న పైరు.. ఇవన్నీ రాబోయే ‘సూపర్ ఎల్ నినో’ మనకు చూపించబోయే విశ్వరూపానికి సంకేతాలు. సాధారణంగా వచ్చే ఎల్ నినో కంటే ఇది అత్యంత శక్తివంతమైనదని, 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వేడిని ఇది భూమిపైకి పంపబోతోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే, మనం ఇప్పటి వరకు చూసిన ఎండలు ఒక ఎత్తు, 2027 వరకు ఉండబోయే పరిస్థితులు మరో ఎత్తు. ఆకాశం నుంచి నిప్పులు కురిసే ఆ రోజులకు మనం సిద్ధంగా ఉండాలి.

భారత్ పై ఎలా ఉండబోతోంది..

భారతదేశం వంటి వ్యవసాయాధారిత దేశాలకు ‘సూపర్ ఎల్ నినో’ గండం లాంటిది. పసిఫిక్ సముద్రం వేడెక్కడం వల్ల రుతుపవనాలు బలహీనపడి, వర్షాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 2026 - 2027లో ఖరీఫ్ సాగు దెబ్బతింటుందని అంచనా. మధ్య, వాయువ్య భారత్ లో కరవు ఛాయలు కమ్ముకోవచ్చు. ఇది కేవలం రైతులే కాకుండా, ఆహార ధాన్యాల ధరలు పెరిగి సామాన్యుడిపై కూడా భారం పడేలా చేస్తుంది.

రికార్డు స్థాయి వేడి

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.., 2027 మానవ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా నిలిచే అవకాశం 90% పైగా ఉంది. సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ పైగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తీవ్రం అవుతుంది. దీనివల్ల నగరాల్లో హీట్ వేవ్స్ పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఏసీలు, కూలర్ల వాడకం పెరిగి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంది.

ఒక చోట కరువు.. మరో చోట వరదలు..

ఎల్ నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వింతైన మార్పులకు దారితీస్తుంది. ఒకవైపు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలు తీవ్రమైన కరవుతో, అడవి మంటలతో పోరాడుతుంటే.. మరో వైపు దక్షిణ అమెరికాలోని పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వరదలు ముంచెత్తుతాయి. ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయి, ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని అల్లకల్లోలం జరిగే పరిస్థితి నెలకొంటుంది. ఇది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు తప్పనిసరి..

వచ్చే ఏడాది కాలంలో నదులు, చెరువులు, డ్యాముల్లో నీటి మట్టాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి కనిపిస్తోంది, అది 2027 నాటికి మరింత ముదిరే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణ వంటి పద్ధతులను పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రకృతి మనకు ఇస్తున్న ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో గుక్కెడు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

‘సూపర్ ఎల్ నినో’ అనేది కేవలం ఒక వాతావరణ మార్పు మాత్రమే కాదు, అది మన సహనానికి పరీక్ష. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కు, ప్రకృతి వైపరీత్యాలు తోడైతే ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గడ్డుకాలం మనకు చూపించబోతోంది. అయితే, సరైన ప్రణాళిక, నీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఈ ప్రభావాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. 2027 వరకు మనం చేసే ప్రతి చిన్న పొదుపు, రేపటి మన మనుగడకు పునాది కాబోతోంది.