అమెరికాలో భారత విద్యార్థులకు ఊరట... 'స్టెమ్' లో జమ్ జమ్!
తాజాగా విడుదల చేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్.ఈ.వీ.ఐ.ఎస్) గణాంకాలు వెలువడ్డాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 6:00 AM ISTడొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అక్కడున్న అంతర్జాతీయ విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే! సమస్య చిన్నదైనా, పెద్దదైనా... రూల్స్ అత్రిక్రమిస్తే దేశ బహిష్కరణ అంటూ ప్రకటనలు వెలువడేవి! ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులకు ఓపీటీ ఎంపికలు పెరిగాయనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు, అక్కడి కంపెనీల్లో వృత్తి పరమైన అనుభవం పొందేందుకు ఉపకరించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఎంపికలు 2023తో పోలిస్తే 2024లో భారీగా పెరిగాయి. ఇందులో భాగంగా... 2023తో పోలిస్తే 2024లో పెరుగుదల 21.1% నమోదైంది.
2023లో 1,60,627 మందికి ఓపీటీ అవకాశాలను కంపెనీలు కల్పించగా.. 2024లో ఈ సంఖ్య 1,94,554 కు చేరింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీ.హెచ్.ఎస్.) తాజాగా విడుదల చేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎస్.ఈ.వీ.ఐ.ఎస్) గణాంకాలు వెలువడ్డాయి.
వాస్తవానికి మన దేశం నుంచి అత్యధికంగా తరలివెళ్లే ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువమంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ / మ్యాథ్ మ్యాటిక్స్ (స్టెమ్) ఎంఎస్ కోర్సుల్లో చేరుతుంటారు. ఎఫ్-1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు, ఓపీటీ కింద తమ చదువుకు సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతి ఉంటుంది.
ఇదే సమయంలో... స్టెమ్ కోర్సులు అభ్యసించిన వారు, స్టెమ్ ఓపీటీని రెండేళ్ల పాటు పొడిగించుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో.. స్టెమ్ ఓపీటీని పొడిగించుకునేందుకు అనుమతిపొందిన వారి సంఖ్య 20223లో 51,507గా ఉండగా.. 2024లో 54 శాతం పెరిగి వీరి సంఖ్య 95,384కి చేరింది.
ఇక స్టెమ్ ఓపీటీ లభించిన వారి సంఖ్య 2024లో 1,65,524గా ఉంండగా.. ఇందులో 48% మంది భారతీయ విద్యార్థులే కావడం గమనార్హం.
