Begin typing your search above and press return to search.

కచ్చతీవు.. మళ్లీ గిల్లిన శ్రీలంక!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 April 2024 2:30 PM GMT
కచ్చతీవు.. మళ్లీ గిల్లిన శ్రీలంక!
X

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణలు, వాగ్బాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ కొత్త చర్చకు ఆయా పార్టీల నేతలు తావిస్తున్నారు.

తాజాగా భారత్, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రంలోని రామేశ్వరం దీవికి అతి సమీపంలో ఉన్న కచ్చతీవు వ్యవహారం ఇప్పుడు ముదిరిపాకాన పడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తమిళనాడు ప్రచారంలో భాగంగా కచ్చతీవును అంశాన్ని లాగడం, ఈ దీవిని 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వమే శ్రీలంకకు ఇచ్చిందంటూ తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమాచార హక్కు చట్టం ద్వారా కచ్చతీవుపై సమాచారం తీసుకోగా 1974లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ.. అప్పటికి భారత్‌ లో ఉన్న కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారని వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర విమర్శలను ఎక్కుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా దీటుగా బదులిస్తోంది. మరి బంగ్లాదేశ్‌ తో సరిహద్దు ఒప్పందం సందర్భంగా 111 భారత్‌ ప్రాంతాలను బంగ్లాదేశ్‌ కు ఎందుకిచ్చారని మోదీని నిలదీస్తోంది.

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా కచ్చతీవు వ్యవహారంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. కచ్చతీవు కేవలం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆకస్మాత్తుగా తెరమీదకొచ్చిన అంశం కాదని తెలిపారు. పార్లమెంటు, కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందన్నారు. కచ్చతీవు వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు తాను జవాబు ఇచ్చానని వెల్లడించారు. అప్పటి ప్రధానులు భారత భూభాగాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో కచ్చతీవుపై శ్రీలంక మౌనం వీడింది. దీనిపై తాజాగా శ్రీలంక మత్స్య శాఖ మంత్రి డగ్లస్‌ దేవానంద స్పందించారు. కచ్చతీవును భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారమూ లేదన్నారు.

ప్రస్తుతం భారత్‌ లో ఎన్నికల సమయమని.. అందువల్ల కచ్చతీవు లాంటి ప్రకటనలు రావడం సహజమేనని డగ్లస్‌ దేవానంద కొట్టిపారేశారు. 1974 నాటి ఒప్పందం ప్రకారం.. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినా, ఇరుదేశాల మత్స్యకారులు ప్రాదేశిక జలాల్లో రెండువైపులా చేపలు పట్టుకోవచ్చని ఆయన గుర్తు చేశారు. 1976లో సైతం ఇంకో ఒప్పందం కుదిరిందన్నారు.

1976లో కుదిరిన ఒప్పందం ప్రకారం సముద్రంలో సరిహద్దులు విభజించారని డగ్లస్‌ దేవానంద తెలిపారు. ఒక దేశం జాలరులు మరొకరి జలాల్లో చేపల పట్టడం నిషిద్ధమని వివరించారు. కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా కన్యాకుమారికి దిగువన వెస్ట్‌ బ్యాంకుతో పిలవబడుతున్న మరో ప్రాంతం భారత్‌ కు దక్కిందన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌.. కచ్చతీవు కంటే 80 రెట్లు పెద్దదన్నారు.

ఈ నేపథ్యంలో కచ్చతీవు వ్యవహారంపై శ్రీలంక మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై భారత్‌ ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.