Begin typing your search above and press return to search.

దొంగల దెబ్బకు ఆగిపోయిన రైళ్లు.. వేలమంది ప్రయాణికులు నరకం

రైళ్లు పట్టాలపై పరుగులు తీయడానికి అత్యంత ముఖ్యమైన రాగి తీగలను (కాపర్ కేబుల్స్) దొంగలు ఎత్తుకెళ్లడంతో స్పెయిన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   6 May 2025 9:07 PM IST
Copper Cable Heist Paralyzes Spain’s Rail System,
X

రైళ్లు పట్టాలపై పరుగులు తీయడానికి అత్యంత ముఖ్యమైన రాగి తీగలను (కాపర్ కేబుల్స్) దొంగలు ఎత్తుకెళ్లడంతో స్పెయిన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఏకంగా వేల సంఖ్యలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని మాడ్రిడ్ నుంచి దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా ప్రాంతానికి వెళ్లే హైస్పీడ్ రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో వేలమంది ప్రయాణికులు రాత్రంతా రైళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం ఈ దారుణమైన దొంగతనం జరిగింది. రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే ఈ ఘటనను ‘తీవ్రమైన విధ్వంసక చర్య’గా అభివర్ణించారు.

హైస్పీడ్ రైలు మార్గంలో ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు వేర్వేరు ప్రదేశాలలో ఈ కేబుల్ దొంగతనం జరిగిందని మంత్రి తెలిపారు. అయితే, సోమవారం ఉదయం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇటీవల స్పెయిన్, పోర్చుగల్‌లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైళ్లు ఆగిపోయిన వారం తిరగకముందే ఈ కొత్త అంతరాయం ఏర్పడటం గమనార్హం. గత వారం విద్యుత్ అంతరాయానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజా కేబుల్స్ దొంగతనం వల్ల 10,000 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

గత వారమే స్పెయిన్, పోర్చుగల్‌లలో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆ తర్వాత పునరుద్ధరించబడింది. ఈ వరుస ఘటనలపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "గత రెండు వారాలుగా ఇలాంటి హఠాత్పరిణామాలు ఎందుకు సంభవిస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది?" అని అమెరికాకు చెందిన పర్యటకుడు కెవిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాడ్రిడ్‌లోని అటోచా స్టేషన్‌లో వేలమంది చిక్కుకుపోయిన ప్రయాణికుల్లో ఒకరు.

మాడ్రిడ్, సెవిల్లె, మలగా, వాలెన్సియా, గ్రెనడా మధ్య కనీసం 30 రైళ్ల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడగా, 10 వేల మందికి పైగా ప్రయాణికులు నానావస్థలు పడ్డారు. ముఖ్యంగా సెవిల్లెలో వారం రోజుల పాటు జరిగే ఫెరియా ఉత్సవం కోసం నగరానికి భారీ సంఖ్యలో పర్యటకులు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన జరగడం మరింత బాధాకరం.‘‘ప్రయాణికులు, సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు హై స్పీడ్ రైళ్ల కార్యకలాపాలు పునరుద్ధరించాం" అని రవాణా మంత్రి సోమవారం ఉదయం తెలిపారు. దొంగతనం జరిగిన ప్రదేశాలకు అటవీ మార్గం ద్వారా చేరుకోవడం సులభమని ఆయన అన్నారు.

రైలు సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని స్పెయిన్ జాతీయ రైల్వే మేనేజర్ ఆదిఫ్ సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించడానికి ఆదిఫ్‌తో సహా ఇతర అధికారులతో సివిల్ గార్డ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని స్పెయిన్ హోంమంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది. గత కొన్నేళ్లుగా రాగి ధర బాగా పెరగడంతో రైలు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల నుంచి కాపర్ కేబుల్ దొంగతనాలు గణనీయంగా పెరిగాయి. ఈ దొంగతనాలు రైల్వే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.