Begin typing your search above and press return to search.

ఎవరీ సోనమ్ వాంగ్ చుక్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నారు?

హిమాలయాల ఒడిలో పుట్టి తన వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

By:  A.N.Kumar   |   17 July 2026 10:08 AM IST
ఎవరీ సోనమ్ వాంగ్ చుక్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నారు?
X

హిమాలయాల ఒడిలో పుట్టి తన వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. బాలీవుడ్ క్లాసిక్ ‘3 ఇడియట్స్’ చిత్రంలో అమీర్ ఖాన్ పోషించిన ‘ఫున్సుక్ వాంగ్డు’ పాత్రకు అసలు సిసలైన స్ఫూర్తి ఈయనే. ప్రస్తుతం ఈ విద్యా సంస్కర్త ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన ఎందుకు ఆమరణ దీక్షకు దిగాల్సి వచ్చింది? అన్నది తెలుసుకుందాం.

సోనమ్ వాంగ్‌చుక్ నేపథ్యం ఏమిటి?

లడఖ్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ ఒక అసాధారణమైన ఇంజనీర్, ఆవిష్కర్త, సామాజిక కార్యకర్త. లడఖ్ లాంటి అత్యంత శీతల, కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతంలో విద్యా సంస్కరణల కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. 1988లో ఆయన స్థాపించిన లడఖ్ విద్యార్థుల విద్యా , సాంస్కృతిక ఉద్యమం (SECMOL) సంస్థ ద్వారా వేలాది మంది చదువుకు దూరమైన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు.

సృజనాత్మకతకు నిలువెత్తు రూపమైన వాంగ్‌చుక్, పర్యావరణ అనుకూల సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో దిట్ట. హిమాలయాల్లో తీవ్రమైన నీటి కొరతను తీర్చడం కోసం ఆయన కనిపెట్టిన ‘ఐస్ స్థూపా’ కృత్రిమ గ్లేసియర్ల సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అలాగే సరిహద్దుల్లో మైనస్ డిగ్రీల చలిలో దేశాన్ని రక్షించే భారత సైనికుల కోసం ఆయన రూపొందించిన ‘సోలార్ హీటెడ్ మిలిటరీ టెంట్స్’ ఆయన దేశభక్తికి, మేధస్సుకు నిదర్శనం. ఆయన చేసిన సేవలకు గానూ ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసేసే’ అవార్డు కూడా దక్కింది.

ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నారు?

సాధారణంగా లడఖ్ పర్యావరణ పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి ఆరో షెడ్యూల్ అమలు వంటి డిమాండ్లపై సుదీర్ఘ పోరాటాలు చేసిన సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం విద్యావ్యవస్థలో జరుగుతున్న తీవ్ర అన్యాయాలపై గళమెత్తారు. దేశాన్ని కుదిపేస్తున్న విద్యా సంస్కరణలు, ముఖ్యంగా ఇటీవలి నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆయన రాజీలేని పోరాటం ప్రారంభించారు.

ప్రధాన డిమాండ్లు ఇవే

‘‘దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలకు తావులేకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. లడఖ్ ప్రాంతానికి ప్రత్యేక రక్షణ, పర్యావరణ భద్రత కల్పించాలి...’’ ఈ ప్రధాన డిమాండ్లతో ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనిపై ఆందోళన వ్యక్తమవడంతో ఆయనకు తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఉద్యమం.. పెరుగుతున్న మద్దతు

మొదట్లో ఈ దీక్ష పరిమితంగానే ప్రారంభమైనప్పటికీ సోనమ్ వాంగ్‌చుక్ వంటి నిష్కళంకమైన వ్యక్తి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుండటంతో దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా లక్షలాది మంది యువత, విద్యార్థులు వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ‘#StandWithSonamWangchuk’ వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్‌కు స్వయంగా వెళ్లి వాంగ్‌చుక్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఇది ఈ నిరసనకు మరింత రాజకీయ ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాలు, పర్యావరణ వేత్తలు పార్లమెంట్ ముట్టడికి లేదా సమీపంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఇంకా అధికారికంగా పెద్దగా స్పందించనప్పటికీ ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న మద్దతు చూస్తుంటే ఇది త్వరలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప ఆవిష్కర్త, దేశం గర్వించదగ్గ పౌరుడు చేస్తున్న ఈ ధర్మపోరాటం చివరకు ఎటు దారితీస్తుందోనని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.