పామును పట్టి మెడలో వేసుకుని తిరిగితే... షాకింగ్ వీడియో!
పాములతో ఎంత ప్రమాదకరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటికి పాలు పోసి పెంచినా విషమే కక్కుతాయనే విషయం ఆ పాలు పోసిన వ్యక్తికి కూడా తెలుసు
By: Tupaki Desk | 18 July 2025 6:00 AM ISTపాములతో ఎంత ప్రమాదకరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటికి పాలు పోసి పెంచినా విషమే కక్కుతాయనే విషయం ఆ పాలు పోసిన వ్యక్తికి కూడా తెలుసు. ఇదే క్రమంలో పాములు పట్టే వ్యక్తి ఒకరు.. తనకు పాముకూ మధ్య ఉన్న బంధం బంధించి, విడిచిపెట్టడం వరకే అనే విషయం మరిచి మెడలో వేసుకున్నాడు.. అది కాస్తా ఒక కాటు వేయడంతో మరణించాడు.
అవును... పాములతో పరాచకాలు ఎంత ప్రమాదకరమో తెలిపే తాజా ఘటన ఒకటి మధ్యప్రదేశ్ లోని గుణ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఇక్కడ పాములు పట్టే వ్యక్తిని ఒక పెద్ద పామును పట్టుకున్నాడు. అనంతరం దాన్ని బంధించి, ఏ అటవీ ప్రాంతంలోనో వదిలేయకుండా మెడలో వేసుకుని, సందడి చేశాడు. దీంతో.. పాము తన సహజ శైలిని ప్రదర్శించింది!
వివరాళ్లోకి వెళ్తే... ఒకప్పుడు ఎవరి ఇంట్లోనో, దుకాణాల్లోనో పాము వెళ్తే వెంటనే చాలా మంది దాన్ని కొట్టి చంపేసేవారు. అయితే ఇటీవల స్నేక్ క్యాచర్స్ కి ఫోన్స్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల మధ్యప్రదేశ్ లోని రాఘోగఢ్ లోని దీపక్ మహావత్ కు.. రాఘోగఢ్ లోని బర్బత్ పురాలోని ఒక ఇంట్లోకి ఒక పాము ప్రవేశించిందని సమాచారం అందింది.
దీంతో అతడు సంఘటనా స్థలానికి పరుగెత్తుకుంటూ వెళ్లి, పామును పట్టుకున్నాడు. ఈ సమయంలో ఆ పామును తన మెడలో వేసుకున్నాడు. అదే స్టైల్లో తన మోటార్ సైకిల్ పై బయలుదేరాడు. అలా పాము భుజాలపైనే ఉండగా ఇంటికి తిరిగి రాగా.. అది అతని చేతిని కాటేసింది. దీంతో.. మరుసటి రోజు ఉదయం స్థానిక ఆసుపత్రిలో మరణించాడు.
వాస్తవానికి కాటు వేసిన తర్వాత, మహావత్ సహాయం కోసం ఒక స్నేహితుడిని పిలిచాడు. దీంతో అతన్ని మొదట రాఘోగఢ్ లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపై మెరుగైన చికిత్స కోసం గుణలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో... సాయంత్రం నాటికి అతని పరిస్థితి మెరుగుపడినట్లు కనిపించింది. దీంతో... మహావత్ ఇంటికి తిరిగి వచ్చాడు.
అయితే ఆ రాత్రి అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో... అతని కుటుంబ సభ్యులు అతన్ని తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున అతడు మరణించాడు. కాగా.. సుమారు 10 ఏళ్లకు పైగా పాములు పట్టే పనిలో ఉన్న మహావత్... వందలాది పాములను పట్టుకుని, అడవిలో వదిలిపెట్టాడని చెబుతున్నారు.
